విద్యార్థుల అండతో కేంద్ర ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తాం: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
విశ్వ విద్యాలయం అంటే దేశ భవిష్యత్తును తయారుచేసే ఖార్ఖానా..! ఆలోచించే మెదళ్లను ప్రోత్సహిస్తేనే జాతి నైతిక, సాంస్కృతిక, మేధోపర ఔన్నత్యం విలసిల్లుతుంది. దీనికి ప్రాథమిక కేంద్రాలు విశ్వవిద్యాలయాలే. ఇక విశ్వవిద్యాలయాల్లో పుట్టుకొచ్చే ఉద్యమాలు దేశ దిశనే మార్చేసిన సంఘటనలు, సందర్భాలు ఎన్నో ఉన్నాయి. విశ్వ విద్యాలయాలు జ్ఞాన సముపార్జనలో, సామాజిక ప్రజాస్వామ్యంలో స్ఫూర్తి దాయకంగా ఉంతాయి. విశ్వవిద్యాలయాలు అణగారిన వర్గాల విద్యార్థులు అవకాశాలను ఇస్తూ ఉంటాయి. విద్యార్థుల ఆకాంక్షలను, సైద్ధాంతిక విలువలను ప్రభుత్వాలు గుర్తిస్తూ ఉండడం కూడా చాలా ముఖ్యం. ఎంతో మంది మేధావులను తయారు చేసే విశ్వ విద్యాలయాలు.. రేపటి కాలంలో ఎన్నో విప్లవాలకు నాంది పలికే అవకాశం ఉంది. విశ్వవిద్యాలయాల, విద్యార్థుల విషయంలో మితిమీరిన జోక్యం చేసుకోవడం కూడా తగదు. ఒక విశ్వవిద్యాలయంలో విద్యార్థులను అణచి వేయడానికి ప్రయత్నిస్తే ఇతర విశ్వవిద్యాలయాలలో ఉద్యమాలు తారాస్థాయికి చేరుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. విద్యార్థుల నోరు మూయించడానికి ప్రయత్నిస్తే ప్రభుత్వాలు కూడా కుప్పకూలిపోయిన సంఘటనలు చాలానే ఉన్నాయి.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల పట్ల చూపెడుతున్న నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా, శివ ముదిరాజ్ నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి మాట్లాడారు. ‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అన్నారు ఆనాడు శ్రీ శ్రీ… కానీ ఈనాటి ప్రభుత్వాలు మనుషులను పట్టించుకోవడమే మానేశాయి. ఓటు బ్యాంకు రాజకీయాలు తప్పితే మనుషుల బాగు కోసం ఏ మాత్రం కార్యాచరణ రచించడం లేదు. ముఖ్యంగా దేశంలో ఎంతో మంది బీసీలు ఉన్నారు.. కానీ వారి కోసం ఈ ప్రభుత్వాలు ఏమైనా చేస్తున్నాయా..?’ అని ప్రశ్నించారు దుండ్ర కుమారస్వామి.’ ఇక యూనివర్సిటీలలో ఎంతో మంది బీసీ విద్యార్థులు చదువుతూ ఉన్నారు.. మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివిస్తూ ఉన్నారో ప్రతి ఒక్క విద్యార్థికీ తెలుసు. మీరు మీ తాత ముత్తాతల నుండి చూస్తూనే ఉన్నారు.. మన బీసీల జీవితాల్లో మార్పులు వచ్చాయా..? ఏ ప్రభుత్వమైనా ఉద్ధరించిందా..? విద్యార్థుల్లారా మీరు బాగా చదువుకోవాలి.. ఆర్థికంగా స్థిరపడాలి.. రాజకీయ చైతన్యం మీ అందరిలోనూ రగలాలి.. బీసీలను బీసీలే పాలించుకోవాలి అనే క్లారిటీ ప్రతి ఒక్కరిలోనూ రావాలి.. అందుకు తగ్గట్టుగానే మీరు ముందుకు వెళ్ళాలి.. ఎవరో వస్తారు.. ఏమో చేస్తారని మీరు అనుకోకండి. రాజ్యాధికారం మనమే సాధించుకోవాలి.. అది ఇక్కడి నుండే మొదలవ్వాలి. ఒక్కో యువకుడు ఒక్కో కొమరం భీమ్ అవ్వాలి..’ అని నినదించారు దుండ్ర కుమారస్వామి. ‘బడుగు బలహీనవర్గాలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలంటే యువతుల పాత్ర కూడా కీలకం. అమ్మాయిలు కూడా రాజకీయంగా ఎదగాలని భావించాలి.. మహిళలందరూ కలిసికట్టుగా ముందుకు వచ్చి, బీసీల అభివృద్ధికి మీ వంతు భాగ స్వామ్యం కావాలి.. ఒక్కో అమ్మాయి.. ఒక్కో శివంగిలా మారి సామాజిక దురాగతాలను ఎదిరించి నిలబడాలి.’ అని అన్నారు.
ఇక కేంద్ర ప్రభుత్వంపై కూడా దుండ్ర కుమారస్వామి ఫైర్ అయ్యారు. బీసీలకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని అన్నారు. తరాలు మారినా బీసీలకు కేంద్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తూనే ఉన్నాయి.. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా బీసీల కోసం ఇంత మంచి పని కూడా చేయడం లేదు. భారత దేశంలో ఎన్నో అంశాలలో లెక్కలు తీస్తున్న కేంద్ర ప్రభుత్వం బీసీల జనాభాపై ఎందుకు లెక్కలు తీయాలని అనుకోవడం లేదో చెప్పాలని దుండ్ర కుమారస్వామి ప్రశ్నించారు.
“బీజేపీ వైఖరి బీసీలకు వ్యతిరేకమని ఎన్నో అంశాలు చెబుతున్నాయి. బీసీలు ఎన్నో ప్రాంతాల్లో.. ఎన్నో రకాలుగా వివక్షను ఎదుర్కొంటూ ఉన్నారు. పలువురు నాయకులకు పల్లకీని మోస్తున్నాం తప్పితే.. మనమే అధికారాన్ని మన చేతుల్లోకి తీసుకోవాలని అనుకోవడం లేదు. ఈ వైఖరి మారాలంటే మన సత్తా మనకు తెలియాలి. బీసీల జనగణన, కుల గణన చేసి.. ఏయే ప్రాంతాల్లో మనమే ఎక్కువగా ఉన్నామో తెలుసుకోవాలి.. అక్కడ మనమే అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కు అనే అస్త్రంతో అధికారంలోకి రావాలే.. అప్పుడే రాజ్యాధికారాన్ని సొంతం చేసుకోగలం. బీసీల అభ్యున్నతికి పాటు పడగలం.” అని దుండ్ర కుమారస్వామి చెప్పుకొచ్చారు. ‘ఈ విషయాలను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి గుర్తుంచుకుంటాడని నేను ఆశిస్తూ ఉన్నాను.. ఎన్నో ప్రభుత్వాలను కూకటివేళ్లతో పెకిలించాయి యూనివర్సిటీలలో వచ్చిన ఉద్యమాలు.. ఇక్కడ కూడా బీసీ విద్యార్థులలో రాజ్యాధికారం అనే ఆకాంక్ష మొదలవుతుందని నేను ఆశిస్తున్నాను. విద్యార్థుల అండతో కేంద్ర ప్రభుత్వానికి చెమటలు పట్టించబోతున్నాం. బీసీలను ఐక్యం చేసే ఉద్యమం ఇక్కడ.. ఇప్పుడే మొదలవ్వబోతోంది’ అని కుమారస్వామి అన్నారు.
ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేకపోతులను నరేందర్ గౌడ్, ప్రభంజన్ యాదవ్, శ్రీ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు పద్మ, దివ్య, కవిత, మొదలుగువారు పాల్గొన్నారు.