ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి: దుండ్ర కుమారస్వామి
హైదరాబాద్, కాచిగూడ: దేశవ్యాప్తంగా బీసీల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి డిమాండ్ చేశారు. కాచిగూడలో నిర్వహించిన కుల సంఘాల అఖిలపక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ దళ్ దక్షిణ రాష్ట్రాల కోఆర్డినేటర్ సత్తార్ కుర్మారావు, యాదవ సంఘం నాయకుడు మణి యాదవ్, మహిళా విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
దశాబ్దాలుగా బీసీలు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబడటానికి కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరే ప్రధాన కారణమని కుమారస్వామి విమర్శించారు. ఎన్నో ఏళ్ల పోరాటం అనంతరం కూడా జనగణనలో ఓబీసీ కులాల వారీగా లెక్కింపు చేపట్టకపోవడం బీసీల పట్ల అన్యాయమని పేర్కొన్నారు. అదే విధంగా ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకపోవడం కూడా కేంద్రం నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.
ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు, జనగణనలో కుల గణన సాధించే వరకు ఉద్యమం ఆగదని కుమారస్వామి స్పష్టం చేశారు. అవసరమైతే జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. బీసీలు రాజకీయంగా బలోపేతం అయినప్పుడే వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. సత్తార్ కుర్మారావు ఆధ్వర్యంలో త్వరలో దక్షిణ రాష్ట్రాల పర్యటన చేపట్టి ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తామని వెల్లడించారు.

