ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య శిబిరాలు దోహదం
కోహినూర్లో ఉచిత వైద్య శిబిరం, మెడికల్ స్క్రీనింగ్కు విశేష స్పందన
సమాజ ఆరోగ్య పరిరక్షణకు వైద్య అవగాహన, ముందస్తు ఆరోగ్య పరీక్షలు అత్యంత అవసరమని అజయ్ మిశ్రా మరియు దుండ్ర కుమారస్వామి పేర్కొన్నారు. సిమ్స్ హాస్పిటల్, బ్లిస్బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఆరో రియాల్టీ కోహినూర్లో 12 వైద్య విభాగాలకు చెందిన నిపుణులచే ఉచిత వైద్య శిబిరం, మెడికల్ స్క్రీనింగ్, రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు.
ఆరో కోహినూర్ ఫ్లాట్ ఓనర్స్ మెయింటెనెన్స్ మ్యూచువల్లి ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సహకారంతో క్లబ్హౌస్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కోహినూర్ కమ్యూనిటీ నుంచి విశేష స్పందన లభించింది. సుమారు 500 కుటుంబాలకు చెందిన సభ్యులు ఆరోగ్య పరీక్షలు చేయించుకుని వైద్య నిపుణుల సూచనలు పొందారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ అధికారి, మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ప్రముఖ సామాజికవేత్త, జాతీయ నాయకుడు దుండ్ర కుమారస్వామి, కోహినూర్ ఫ్లాట్ ఓనర్స్ సొసైటీ డైరెక్టర్లు నరసింహ, కిషోర్, కరుమూరి, విజయ్ మిశ్రా, అరుణ్ రెడ్డి, వర్మ సత్యనారాయణ, మస్తాన్ రెడ్డి, సిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ కుర్మా రావ్ , డైరెక్టర్ శ్రీనివాస్, ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా మాట్లాడుతూ, “ఇలాంటి కార్యక్రమాలు కేవలం వైద్య శిబిరాలు మాత్రమే కావు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వేసే బలమైన అడుగులు. ఒక సమాజ అభివృద్ధికి ఆరోగ్యం పునాది. అందుకే మన పెద్దలు ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంపద, హోదా, విజయాలు, కుటుంబ సంతోషం విలువైనవిగా ఉంటాయి” అని పేర్కొన్నారు.

దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ, వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స పొందడం కంటే ముందుగానే గుర్తించి నివారించడమే ఉత్తమ వైద్యమని అన్నారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, మెడికల్ స్క్రీనింగ్ నిర్వహించుకోవడం, వ్యాయామం, యోగా, ధ్యానం వంటి అలవాట్లను పెంపొందించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని సూచించారు.
నేటి డిజిటల్ యుగంలో అధిక ఒత్తిడి, ఫాస్ట్ఫుడ్ అలవాట్లు, శారీరక శ్రమ తగ్గిపోవడం వంటి కారణాలతో మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కోట్లాది మంది ప్రజలు జీవనశైలి సంబంధిత వ్యాధులతో బాధపడుతుండగా, వారిలో చాలామందికి తమకు వ్యాధి ఉన్న విషయమే తెలియకపోవడం మరింత ఆందోళనకరమని పేర్కొన్నారు.
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యులు మాట్లాడుతూ, ఒక వ్యక్తి అనారోగ్యానికి గురైతే మొత్తం కుటుంబం ఆర్థికంగా, మానసికంగా ప్రభావితమవుతుందని తెలిపారు. కుటుంబాన్ని నడిపించే తల్లి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని, వృద్ధులు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, యువత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
ఆరోగ్యం వ్యక్తిగత అంశం మాత్రమే కాదని, అది కుటుంబం, కమ్యూనిటీ, సమాజం కలిసి మోసే బాధ్యత అని పేర్కొన్నారు. ఆరోగ్యంపై ఖర్చు చేయడం వ్యయం కాదని, అది భవిష్యత్తుపై పెట్టుబడి అని అన్నారు. ఆరోగ్యవంతమైన కుటుంబాలే ఆరోగ్యవంతమైన సమాజానికి పునాదిగా నిలుస్తాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కోహినూర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యులతో పాటు కమ్యూనిటీ ప్రతినిధులు, నివాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
