సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఘనంగా ఆవిర్భావ వేడుకలు
సకల జనుల సౌభాగ్యమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఉద్ఘాటించారు. సంపద సృష్టించాలి.. సృష్టించిన సంపదను ప్రజలకు పంచాలి అనే సూత్రం ప్రాతిపదికగా ప్రభుత్వం పురోగమిస్తున్నదని తెలిపారు. గడిచిన నాలుగేండ్లలో బంగారు తెలంగాణ దిశగా బలమైన అడుగులు వేయగలిగామని అన్నారు. నిరంతర ప్రగతిశీల రాష్ట్రంగా యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించామని చెప్పారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతున్నదని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును వ్యవసాయానికి వరదాయిని, తెలంగాణకు జీవనదాయినిగా సీఎం అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం పరేడ్గ్రౌండ్లో జరిగిన ప్రధాన కార్యక్రమానికి హాజరైన సీఎం.. జాతీయజెండా ఎగురవేసి, పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం గత నాలుగేండ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్ ఆలోచనలను వివరించారు. రాష్ట్ర సాధనకోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ కంటి వెలుగు పేరిట నేత్ర పరీక్షలను ఆగస్టు 15 నుంచి ప్రారంభించనున్నట్టు సీఎం ప్రకటించారు. ఆగస్టు 15 నుంచి రైతులకు అందించే బీమా పత్రాలు.. రైతుల కుటుంబాలకు భద్రతా పత్రాలని అభివర్ణించారు. త్వరలో నూతన రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వస్తుందన్నారు.
కష్టాలను దూరం చేసుకుంటూ..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తప్ప తలరాత మారదనే వాస్తవాన్ని గ్రహించి, ఉవ్వెత్తున ఉద్యమించి స్వరాష్ట్రం సాధించుకున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. ఆ క్రమంలో తెలంగాణ ప్రజల కష్టాలు, కడగండ్లు, వాటికి కారణాలు గుర్తించామని.. వాటిని పరిష్కరించే దిశగా మేనిఫెస్టో రూపొందించామని చెప్పారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మరుక్షణం నుంచే హామీలను అమలు చేస్తున్నామని.. విస్తృత ప్రజాప్రయోజనం కలిగించే కొత్త పథకాలను ప్రవేశపెట్టామని తెలిపారు. ‘సంపద సృష్టించాలి.. సృష్టించిన సంపదను ప్రజలకు పంచాలి..’అనే సూత్రం ప్రాతిపదికగా ప్రభుత్వం పురోగమిస్తోందన్నారు. దేశంలో మరే రాష్ట్రం అమలు చేయని అద్భుత కార్యక్రమాలను తెలంగాణలో చేపట్టామని.. పలు రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు, అధికారులు వీటిని పరిశీలించి, తమ రాష్ట్రాల్లోనూ అమలు చేసేందుకు పూనుకుంటున్నారని తెలిపారు. ఇది తెలంగాణ బిడ్డలుగా మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు.
రైతులకు జీవిత బీమా
రైతులకు భూమి తప్ప మరే జీవనాధారం ఉండదు. రాష్ట్రంలో చాలామంది చిన్న, సన్నకారు రైతులే. ఎకరంలోపు భూమి ఉన్న రైతులు 18 లక్షలమంది ఉన్నారు. పేదరైతులెవరైనా దురదృష్టవశాత్తూ చనిపోతే, వారి కుటుంబాలు ఉన్నట్టుండి అగాథంలో పడిపోతాయి. అటువంటి కుటుంబాలకు ఆర్థిక భరోసా ఉండాలనే ఉదాత్తమైన ఆలోచనతో ప్రభుత్వం ఎల్ఐసీ ద్వారా రైతులకు జీవితబీమా పథకాన్ని ప్రారంభిస్తున్నది. ఇకపై తెలంగాణలో ఏ రైతు మరణించినా అతని కుటుంబానికి 10 రోజుల్లోనే ఐదు లక్షల జీవిత బీమా మొత్తం అందితీరుతుంది. రైతు మీద ఒక్క పైసా భారం వేయకుండా ప్రీమియాన్ని ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తుంది. ఆగస్టు 15 నుంచి రైతులకు బీమా పత్రాలు అందుతాయి. ఇవి కేవలం బీమా పత్రాలు కావు.. రాష్ట్రంలోని రైతుల కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న భద్రతా పత్రాలు.
కోటి ఎకరాలకు నీరిచ్చి తీరుతాం..
రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించి తీరాలనే దృఢ సంకల్పంతో ప్రాజెక్టులు చేపట్టామని కేసీఆర్ తెలిపారు. సమైక్య పాలకులు కావాలనే అంతర్రాష్ట్ర వివాదాలకు ఆస్కారమిచ్చేలా ప్రాజెక్టులను డిజైన్ చేసి, తర్వాత ఆ వివాదాలను సాకుగా చూపి ప్రాజెక్టులు నిర్మించలేదని ఆరోపించారు. దాంతో తమ ప్రభుత్వం ప్రాజెక్టులను రీడిజైన్ చేసి.. పనులు కొనసాగించాల్సి వచ్చిందని చెప్పారు. గత 70 ఏళ్లలో రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వాలేవీ మహారాష్ట్రతో ఒప్పందాలు చేసుకోలేకపోయాయని.. తాము తెలంగాణ ప్రజల విశాల ప్రయోజనాల కోసం ఎంతో పరిణతితో వ్యవహరించి.. అంతర్రాష్ట్ర ఒప్పందాలను సాధించుకోగలిగామని పేర్కొన్నారు. దీంతో గోదావరిపై ప్రాజెక్టులు నిర్మించుకోవడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలిగాయన్నారు. గోదావరి, కృష్ణా నదుల మీద 23 భారీ ప్రాజెక్టులు, 13 మధ్యతరహా ప్రాజెక్టుల పనులు చేపట్టామని.. ఏటా బడ్జెట్లో రూ. 25 వేల కోట్లు కేటాయించుకుంటున్నామని చెప్పారు.
సృష్టించిన సంపద ప్రజలకు పంచాలి
21% ఆదాయాభివృద్ధి రేటుతో ధనిక రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. సంపద సృష్టించాలి.. సృష్టించిన సంపదను ప్రజలకు పంచాలి అనే సూత్రం ప్రాతిపదికగా ప్రభుత్వం పురోగమిస్తున్నది. ఏ రాష్ట్రంలో లేనివిధంగా రూ.40వేల కోట్లతో 40 పథకాల ద్వారా ప్రజాసంక్షేమానికి పెద్దఎత్తున పాటుపడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఆసరా పింఛన్లు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, బోదకాలు బాధితులకు, ఇమామ్, మౌజన్లకు ప్రభుత్వం జీవనభృతి అందిస్తున్నది. కల్యాణలక్ష్మి ద్వారా రూ.1,00,116 ఆర్థిక సహాయం అందిస్తున్నాం. రైతు రుణమాఫీ, నిరంతర విద్యుత్, సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరా, పెద్ద ఎత్తున గోదాంల నిర్మాణం, నీటితీరువా బకాయిల రద్దు తదితర నిర్ణయాలతో రైతుల జీవితాల్లో ఆనందపు వెలుగులు నిండాయి.
గణనీయంగా పెరుగుతున్న పశుసంపద
గొల్ల, కురుమలకు 75% సబ్సిడీపై ప్రభుత్వం పెద్ద ఎత్తున గొర్రెలు పంపిణీ చేస్తున్నది. ఇప్పటికే పంపిణీచేసిన గొర్రెలు పిల్లలను పెడుతుండటంతో రాష్ట్రంలో పశుసంపద గణనీయంగా పెరుగుతున్నది. చేపల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. వీటి పెంపకానికి అవసరమయ్యే పెట్టుబడిని ప్రభుత్వమే భరించి, లాభాలు మాత్రం బెస్త, ముదిరాజ్ తదితర మత్స్యకారులకు అందిస్తున్నది. నవీన క్షౌరశాలల ఏర్పాటుకు నాయీ బ్రాహ్మణులకు, అధునాతన యంత్రపరికరాల కొనుగోలుకు రజకులకు, అదే విధంగా ఇతర కులాల వారికి ఆర్థిక సహాయం అందించబోతున్నది. కల్లుగీత వృత్తిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వమే రాష్ట్రవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ఈత, తాటిచెట్ల పెంపకం చేపట్టింది. సంచార, ఆశ్రిత కులాలు, తదితర వర్గాలవారి కోసం రూ.1000 కోట్లతో ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటుచేశాం.