యోగ ద్వారానే ఆరోగ్య భాగ్యం: హైదరాబాద్ సీపీ సజ్జనార్
అంతర్గత శక్తిని మేల్కొల్పే మహోన్నత సాధన యోగ: జాతీయ నాయకుడు దుండ్ర కుమారస్వామి
యోగను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పిలుపునిచ్చారు.అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఆరో కోహినూర్ ఫ్లాట్స్ ఓనర్స్ మెయింటెనెన్స్ మ్యూచువల్లి ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో సొసైటీ ప్రాంగణంలో నిర్వహించిన యోగా దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ యోగా గురువులు అరుణ్ గుప్తా (రాజస్థాన్), మిశ్రా, జాతీయ నాయకుడు, ప్రముఖ సామాజికవేత్త దుండ్ర కుమారస్వామి, ఆరో కోహినూర్ సొసైటీ అధ్యక్షుడు శ్రీకాంత్, కార్యదర్శి నరసింహ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు కృష్ణ ప్రసాద్, కిషోర్, అరుణ్ రెడ్డి, సురేష్, సత్యనారాయణ, వర్మ సునీత, రుచిరా, ప్రముఖ వైద్యులు, మేధావులు, సామాజికవేత్తలు, పారిశ్రామికవేత్తలు, పెద్ద సంఖ్యలో నివాసితులు పాల్గొని యోగా ఆసనాలు అభ్యసించారు.
ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ, యోగ అనేది కేవలం ఆసనాలు వేయడం మాత్రమే కాదని, మన శరీరం, మనస్సు, ఆత్మను సమతుల్యంగా తీర్చిదిద్దే సంపూర్ణ జీవన విధానమని అన్నారు. ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళన, జీవనశైలి సంబంధిత వ్యాధులను అధిగమించేందుకు యోగ అత్యుత్తమ మార్గమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ యోగను దైనందిన జీవితంలో భాగంగా మార్చుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.
జాతీయ నాయకుడు, ప్రముఖ సామాజికవేత్త దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ, యోగ మనలోని అంతర్గత శక్తిని మేల్కొల్పే మహోన్నత సాధనమన్నారు. “ఆరోగ్యమే మహాభాగ్యం” అని మన పెద్దలు చెప్పిన మాట నేటి కాలంలో మరింత సార్థకమైందని పేర్కొన్నారు. భారతదేశం వేల సంవత్సరాల క్రితమే యోగ అనే అమూల్యమైన జీవన విధానాన్ని ప్రపంచానికి అందించిందని, యోగ అనేది కేవలం వ్యాయామం కాకుండా శరీరం, మనస్సు, ఆత్మను సమన్వయం చేసే సంపూర్ణ జీవన విధానమని వివరించారు. నేడు మనిషికి డబ్బు ఉన్నా ప్రశాంతత లేదని, సాంకేతికత ఉన్నా సమయం లేదని, సౌకర్యాలు ఉన్నా ఆరోగ్యం లేదని పేర్కొంటూ, “యోగ మందు కాదు… మందుల అవసరాన్ని తగ్గించే అద్భుతమైన జీవనశైలి” అని అన్నారు.

ప్రముఖ యోగా గురువు అరుణ్ గుప్తా మాట్లాడుతూ, పిల్లలకు కోట్ల రూపాయల ఆస్తులు మాత్రమే కాకుండా జీవితాంతం తోడుగా ఉండే మంచి ఆరోగ్యాన్ని కూడా అందించాలని సూచించారు. ప్రతి కుటుంబంలో యోగను జీవన సంస్కృతిగా అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.
ఆరో కోహినూర్ సొసైటీ అధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో గుండెజబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు, మానసిక ఒత్తిడి వంటి జీవనశైలి సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో యోగ ప్రతి ఒక్కరి జీవితంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
సొసైటీ కార్యదర్శి నరసింహ మాట్లాడుతూ, రోజుకు కేవలం 20 నుంచి 30 నిమిషాలు యోగ చేస్తే శారీరక దృఢత్వం పెరగడంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతాయని తెలిపారు.
ప్రముఖ యోగా గురువు మిశ్రా మాట్లాడుతూ, రోజుకు గంటల తరబడి మొబైల్కు సమయం కేటాయించే మనం మన ఆరోగ్యం కోసం కనీసం అరగంట సమయం కేటాయించాలని, ఆరోగ్యమే నిజమైన సంపద అని అన్నారు.చివరగా సొసైటీ సభ్యులందరూ యోగా ఆసనాలు, ప్రాణాయామం అభ్యసించి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ప్రతిజ్ఞ చేశారు.




