వరంగల్ : తెలంగాణ రాష్ట్ర, వరంగల్ జిల్లా హసన్పర్తికి చెందిన విద్యార్థిని మేకల అంజలి రెండు సంవత్సరాల క్రితం ఐఐటీలో సీటు దక్కించుకుంది. అయితే తన కుటుంబ పేదరికం, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తన చదువును కొనసాగించేందుకు ఆర్థిక సహాయం చేయాలని మంత్రి కేటిఆర్ గారిని కోరింది. మేకల అంజలి పరిస్థితిని తెలుసుకున్న మంత్రి కేటీఆర్ తన వ్యక్తిగత హోదాలో గత రెండు సంవత్సరాలుగా ప్రతి ఏడాది ఆమె ఫీజులకు అవసరమైన నిధులను అందిస్తూ వస్తున్నారు.
ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది మరియు రానున్న సంవత్సరానికి సంబంధించిన ఐఐటి ఫీజుల మొత్తాన్ని ఈరోజు మంత్రి కేటీఆర్ అంజలి కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా అంజలి చదువు మరియు భవిష్యత్ ప్రణాళికల గురించి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి, ఆమె తన చదువును దిగ్విజయంగా పూర్తి చేసుకొని జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. తమ కూతురు ఐఐటి విద్యకు పూర్తి ఆర్థిక సహాయాన్ని అందించడం పట్ల అంజలి కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.