యూనిటీ పేరిట చిత్రీకరించిన బాపూజీ డాక్యుమెంటరీ పై పలువురి సామాజికవేత్తల అభిప్రాయం
కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం భావితరాలకు డాక్యుమెంటరీ రూపంలో చిత్రీకరించి అందించడం సముచితమని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు.
బాపూజీ జీవించినంత కాలం ఐక్యతతోనే ఏదైనా సాధించవచ్చు అని బలహీన వర్గాలను ఏకం చేసే ప్రయత్నం చేశారు అదే ఆదర్శం తో యూనిటీ పేరిట డాక్యుమెంటరీని చిత్రీకరించడం గొప్పగా ఉందన్నారు.
కొండ లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రను 50 నిమిషాల నిడివి గా డాక్యుమెంటరీని గురువారం నాడు స్థానిక ప్రసాద్ లేబరేటరీ లో ప్రదర్శించారు. ఈ చిత్రానికి విజయ్ కుమార్ దర్శకత్వం వహించారు.ధనుంజయ నిర్మించారు. ఈ ప్రదర్శనకు సమాజంలోని ప్రముఖ సామాజికవేత్తలను వివిధ సంఘాల ప్రజాప్రతినిధులను ఆహ్వానించారు. బిసి కమిషన్ సభ్యులు సిహెచ్ ఉపేంద్ర, శుభ ప్రద్ పటేల్, కే కిషోర్ గౌడ్,జాతీయ బీసీ దల్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, మాజీ ఎమ్మెల్యే, వన్నాల శ్రీరామ్, ఎంబీసీ టైమ్స్ అధినేత సంగం సూర్యారావు, పద్మశాలి సంఘం నాయకులు, ప్రముఖ జర్నలిస్ట్ పాశం యాదగిరి, విప్లవ గాయని విమలక్క, గుజ్జ సత్యం, ప్రముఖ సినీనటి పూనమ్ కౌర్, గోశిక యాదగిరి,
వివిధ కళాకారులు సంఘాల నేతలు సామాజికవేత్తలు మేధావులు, విద్యావంతులు, పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వకుళాభరణం ప్రసంగిస్తూ మహనీయుల జీవితాలను చలనచిత్రాలు డాక్యుమెంటరీల రూపంలో చిత్రీకరించి ప్రదర్శించడం భావితరాలకు అవసరమని ఆయన తెలిపారు. ఫాష్యం యాదగిరి ప్రసంగిస్తూ బాపూజీ ఆశయాలను చిత్రంలో చిత్రీకరించిన తీరు గొప్పగా ఉందన్నారు. ఆయన ఆశయాలను నెరవేర్చడానికి సిద్ధం కావాలని కోరారు. జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు కుమారస్వామి ప్రసంగిస్తూ స్వాతంత్ర పోరాటంలోనూ ,నిజాం వ్యతిరేక పోరాటంలోనూ కొండ లక్ష్మణ్ బాపూజీ పాత్ర చాలా కీలకమైనదని తెలిపారు. నాటి తొలి మలి దశ ఉద్యమాలలో కీలకపాత్ర పోషించారని ,తెలంగాణ ఉద్యమానికి ఆయన ఆది గురువు, గాంధీ లాంటివాడని అన్నారు. బడుగు బలహీన వర్గాల సమస్యల పైన తెలంగాణ సమస్యల పైన పోరాటం చేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. ఈ చిత్రంను ప్రతి ఒక్కరు చూసి స్ఫూర్తి పొందాలని కోరారు. సినీ నటి పూనమ్ కౌర్ మాట్లాడుతూ బాపూజీని ప్రత్యక్షంగా చూసే అదృష్టం కలగనప్పటికీ ఈ డాక్యుమెంటరీని చూశాక ఆయన ఎంత గొప్ప మహనీయుడు తెలిసిందని అన్నారు ఇలాంటి సమరయోధుల త్యాగఫలంగానే నేటి సమాజాలు గొప్పగా విరాజిల్లుతున్నాయని ఆమె తెలిపారు. బిసి కమిషన్ సభ్యులు సిహెచ్ ఉపేంద్ర, శుభ ప్రద్ పటేల్, కే కిషోర్ గౌడ్ మాట్లాడుతూ బాపూజీ తో అనుభవాలను గుర్తు చేసుకున్నారు. బాపూజీ తో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం రావడం తమ జీవితాలలో మలుపురాణి ఘట్టాలు అని తెలిపారు.