గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్కు అడ్డుకట్ట వేయాలి
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు: దుండ్ర కుమారస్వామి
రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో పదేపదే జరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనలకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన అడ్డుకట్ట వేయాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, న్యాయవాది దుండ్ర కుమారస్వామి డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్లోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో భోజనం వికటించి 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ఆయన తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
గురుకులాల్లో వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం అధికారుల పర్యవేక్షణ వైఫల్యానికి, ఆహార నాణ్యత నియంత్రణలోని లోపాలకు నిదర్శనమని దుండ్ర కుమారస్వామి పేర్కొన్నారు. ప్రభుత్వ సంరక్షణలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు సురక్షితమైన, పరిశుభ్రమైన, పోషక విలువలతో కూడిన ఆహారం అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని స్పష్టం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థుల ఆరోగ్యం, ప్రాణాలకు ముప్పు ఏర్పడటం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన జీవించే హక్కుకు భంగం కలిగించడమేనని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో ఆహార పదార్థాల కొనుగోలు, నాణ్యత, నిల్వ విధానం, వంటశాలల పరిశుభ్రత, తాగునీటి నాణ్యత, ఆహార నమూనాల పరీక్షలు, అధికారుల తనిఖీలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన కోరారు. ప్రతి ఘటన అనంతరం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా, ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని, విద్యార్థుల జీవించే హక్కు, ఆరోగ్య హక్కుల పరిరక్షణకు తక్షణ ఆదేశాలు జారీ చేయాలని మానవ హక్కుల కమిషన్ను కోరినట్లు దుండ్ర కుమారస్వామి తెలిపారు.

