హెచ్1బీ వీసాల జారీ ప్రక్రియను అమెరికా కఠినతరం చేసింది
ఇందుకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నూతన విధాన ప్రకటన చేసింది. ఇకపై హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తు చేసే ఐటీ కంపెనీలు అదనపు వివరాలు అందజేయాల్సి ఉంటుంది. తమ ఉద్యోగులకు సంబంధించిన వివరాలను, అందుకు తగిన ఆధారాలను తప్పనిసరిగా పొందుపర్చాలని పేర్కొంటూ గురువారం ఏడుపేజీల మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హెచ్1బీ వీసాల దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 2 నుంచి ప్రారంభం కానున్నది. 2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుంది. మరికొద్ది రోజుల్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుండగా, అమెరికా నూతన నిబంధనలు జారీ చేసింది.
అమెరికా ఉద్యోగాలు.. స్థానికులకే అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ తన హామీని నెరవేర్చే ప్రయత్నంలో భాగంగా హెచ్1బీ వీసాల జారీ విధానంలో భారీ మార్పులకు ప్రయత్నిస్తున్నారు. మరికొద్దివారాల్లో నూతన వీసాల ప్రకియ ప్రారంభం కానుండగా, ఆంక్షలతో కూడిన తాజా విధానాన్ని ప్రకటించడం భారత ఐటీ రంగాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేసింది. హెచ్1బీ వీసా నూతన నిబంధనలు భారతీయులకేకాకుండా, అమెరికా ఆర్థిక వ్యవస్థకూ భారీగా నష్టం కలిగిస్తుందని నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. హెచ్1బీ వీసా ద్వారా విదేశీ ఉద్యోగులకు తాత్కాలికంగా అమెరికాలోని కంపెనీల్లో పనిచేసే అవకాశం లభిస్తున్నది. ఈ వీసా ద్వారా పలు కంపెనీలు అమెరికన్ ఉద్యోగుల కొరత ఉన్న చోట నిపుణులైన విదేశీ ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ముఖ్యంగా భారత ఐటీ కంపెనీలు ఈ విధానంతో బాగా లబ్ధి పొందుతున్నాయి. థర్డ్ పార్టీ వర్క్సైట్లో ఎక్కువ సంఖ్యలో తమ ఉద్యోగులను నియమిస్తున్నాయి. తాజాగా అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ (యూఎస్సీఐఎస్) విడుదల చేసిన నూతన పాలసీ ప్రకారం.. ఉద్యోగులు థర్డ్పార్టీ వర్క్సైట్లో పనిచేసే పరిమిత కాలానికి మాత్రమే హెచ్1బీ వీసా ఇవ్వాలని పేర్కొన్నది. ప్రస్తుతం హెచ్1బీ వీసా గడువు మూడేండ్లు కాగా, తాజా నిబంధనల్లో అంతకంటే తక్కువే ఉండాలని తెలిపింది. బెంచ్లో ఉన్న ఉద్యోగులకు హెచ్1బీ వీసా పొడిగింపు మరింత కఠినతరం కానున్నది.