ఉప్పల్ : ఉప్పల్ నల్ల చెరువు వద్ద నిర్మించిన ‘ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్’ను మంత్రులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీ మహమూద్ అలీలతో కలిసి పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ వర్చ్యువల్ గా ప్రారంభించారు. అనంతరం జలమండలి ఆధ్వర్యంలో నడిచే ‘డయల్ ఏ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్’ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ దానం నాగేందర్, మేయర్ శ్రీమతి గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతె శ్రీలత శోభన్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, జలమండలి ఎండి దాన కిషోర్ పాల్గొన్నారు

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..
డయల్ ఏ సెప్టిక్ ట్యాంక్ పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందించదగ్గ విషయమన్నారు. నాగరికమైన పద్ధతుల్లో పట్టణాల్లో ప్రజలు జీవించాలి. పరిశుభ్రమైన వాతావరణంలో మన పిల్లలు ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుంది. మానవ వ్యర్థాలను సరైన పద్ధతిలో శుద్ధి చేయకపోతే రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఆ వ్యర్థాలను శాస్ర్తీయమైన పద్దతుల్లో శుద్ధి చేయాలన్నారు. నాలాల క్లీనింగ్ కోసం కొత్త వాహనాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులు, కాల్వల్లో మానవ వ్యర్థాలు కలవకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దేశంలోనే ఇది అతిపెద్ద ప్రయత్నమన్నారు. వినూత్న ఆలోచనలు అమలు చేస్తూ క్లీన్ హైదరాబాద్ కోసం పాటుపడుతున్నామని కేటీఆర్ తెలిపారు. మిగతా నగరాలకు హైదరాబాద్ ఆదర్శంగా నిలిచిందన్నారు. 71 చోట్ల ఎఫ్ఎస్టీపీలను నిర్మిస్తున్నాం. త్వరలో మరో 68 నిర్మిస్తామని ప్రకటించారు. ఈ నూతన వాహనాల్లో పరిమితమైన ఛార్జీలతో మానవ వ్యర్థాలను తరలిస్తారని, పేద ప్రజలు ఉండే చోట తక్కువ ఛార్జీలను నిర్ణయించామని కేటీఆర్ తెలిపారు.