భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఓ ఇంటివారయ్యారు. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధువులు, స్నేహితులు సమక్షంలో ఈ ప్రేమ జంట ఒక్కటైంది. ఇటలీలోని తాస్కానిలోని ఓ రిసార్టులో విరాట్, అనుష్కలు పెళ్లి చేసుకున్నారు. 2013లో ఓ వాణిజ్య ప్రకటన షూటింగ్ సందర్భంగా కలిసిన కోహ్లీ, అనుష్క కొన్నేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నారు. పెళ్లి చేసుకోవాలని ఈ ప్రేమ జంట ఈ మధ్యనే నిర్ణయించుకున్నా ఆ విషయం అధికారికంగా మాత్రం ప్రకటించలేదు.
శుక్రవారం అర్ధరాత్రి అనుష్క కుటుంబం ముంబయి నుంచి దిల్లీ వెళ్లగా వీరిద్దరి వివాహంపై వూహాగానాలు జోరందుకున్నాయి. అందుకు తగినట్లుగే అనుష్క, విరాట్ వివాహబంధంతో ఒకటయ్యారు. ఇటలీ నుంచి తిరిగొచ్చాక ఈ నెలాఖరులో విరుష్క జోడి ముంబయిలో పెళ్లి విందు ఇవ్వనుందని, జనవరి 4న ముంబయిలోని బాంద్రా కుటుంబ కోర్టులో పెళ్లి రిజిస్ట్రేషన్ ఉంటుందని తెలిసింది. మరోవైపు విరాట్, అనుష్క జంటకు సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
రెండు చోట్ల వివాహ విందు
ఇటలీలో కొద్దిమంది కుటుంబ సభ్యుల మధ్య ఒక్కటైన ఈ జంట తమ బంధువుల కోసం ఈ నెల 21న దిల్లీలో, మిత్రులు, క్రికెటర్ల కోసం ఈ నెల 26న ముంబయిలో వివాహ విందు ఇవ్వనున్నట్టు ప్రకటించారు.
ట్విటర్లో పెళ్లి చిత్రాలు..
విరాట్కోహ్లీ, అనుష్కశర్మలు తమ పెళ్లి చిత్రాలను ట్విటర్లో పోస్టు చేశారు. ట్విటర్లో చిత్రాలను ఇప్పటికే వేల సంఖ్యలో అభిమానులు రీట్వీట్ చేశారు.