వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళిక- మూసీ ఎక్స్ప్రెస్ వే
నగరంలో రోజురోజుకీ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం రూపకల్పన చేసిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళిక (ఎస్ఆర్డీపీ) పథకం కిందనే త్వరలోనే మూసీ ఎక్స్ప్రెస్ వే పనులను చేపట్టనున్నట్లు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే.తారక రామారావు వెల్లడించారు. ఎస్ఆర్డీపీలో భాగంగా చింతల్కుంటలో నిర్మించిన అండర్పాస్ను మంగళవారం మంత్రి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పర్యావరణ పరంగా క్లియరెన్స్ అనుమతి వచ్చిన వెంటనే మూసీ ఎక్స్ప్రెస్ వే పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఇప్పటి వరకు పూర్తయిన ఎస్ఆర్డీపీ పనులతో 18 జంక్షన్లలో ఎలాంటి ఆటంకాల్లేకుండా ట్రాఫిక్ ముందుకు సాగుతోందన్నారు. నగరంలో మొత్తం రూ.3వేల కోట్లతో చేపట్టిన ఎస్ఆర్డీపీ పనుల్లో భాగంగా ఒక్క ఎల్బీనగర్ వద్దనే సుమారు రూ. 450 కోట్లతో వివిధ రకాల పనులు చేపట్టినట్లు తెలిపారు. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ఎన్నో పనులు చేపట్టామని, ఈ పనులన్నీ సకాలంలో పూర్తయి, ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధించేందుకు నగరవాసులు కూడా సహకరించాలని మంత్రి సూచించారు.
ప్రతి ఒక్క ప్రాజెక్టు, పనికి సంబంధించి ప్రభుత్వం నిర్ణీత గడువును నిర్ణయించిందని, దాని ప్రకారమే పనులను పూర్తి చేసేందుకు వీలుగా జీహెచ్ఎంసీ, ఇతర శాఖల అధికారులు కృషి చేస్తున్నారని మంత్రి వెల్లడించారు. కాలుష్యం, దోమల బెడద వంటి తదితర ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. జీహెచ్ఎంసీ గతంలో గుర్తించిన 300 వాటర్ స్టాగినేషన్ పాయింట్లలో నీరు నిల్వకుండా తగిన చర్యలు చేపట్టామని వివరించారు. అన్ని పాయింట్లలో పనులను వర్షాకాలం ప్రారంభంలోపే పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీలు మల్లారెడ్డి, ఎమ్మెల్యే కృష్ణయ్య, కృష్ణారెడ్డి, శంభీపూర్రాజు, జీహెచ్ఎంసీ ఇన్చార్జి కమిషనర్ భారతి హోళికేరి పాల్గొన్నారు.