ప్రణాళికాబద్ధంగా పట్టణాలను అభివృద్ధి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి పురపాలక శాఖ పరిధిలో ఉన్న వివిధ అంశాలపైన జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి శ్రీ కేటీఆర్ పాల్గొన్నారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ వివిధ రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు, పట్టణాభివృద్ధి నిపుణులతో చర్చించారు. ఆరు గంటలపాటు జరిగిన ఈ విస్తృతస్థాయి మేధోమధన సమావేశంలో పలు అంశాలపైన మున్సిపల్ శాఖ విభాగాల అధిపతులు పలు నిర్ణయాలు తీసుకున్నారు.

ముఖ్యంగా పట్టణాల ప్రణాళిక రూపొందించే సమయంలో భవిష్యత్ అవసరాలకు సంబంధించి పెద్దపీట వేయాలని ఈ సమావేశంలో పాల్గొన్న పట్టణాభివృద్ధి నిపుణులు సూచించారు. ముఖ్యంగా గతంలోకన్నా భిన్నంగా పట్టణాల అవసరాలు ఉన్నాయని, దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రణాళికలను రూపొందించి ముందుకు పోవాల్సిన అంశాన్ని ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో పాల్గొన్న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పట్టణాల అభివృద్ధి పట్ల తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తున్నదని, కేవలం స్వల్పకాలిక లక్ష్యాలతో మాత్రమే కాకుండా దీర్ఘకాలిక లక్ష్యాలతో పట్టణాలను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆ దిశగా రాష్ట్రంలోనే అతిపెద్ద పురపాలిక అయిన హైదరాబాద్ నగరంలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అనేక మౌలిక వసతుల కార్యక్రమాలను, ప్రాజెక్టులను చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
పట్టణ ప్రణాళిక తయారీలో దేశంలోని ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న ఆదర్శవంతమైన పద్దతుల పైన మహారాష్ట్ర, తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాల ఉన్నతాధికారులు, ఇతర పట్టణ అభివృద్ధి నిపుణులతో ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ చర్చించారు. పట్టణాలు దేశ, రాష్ట్ర ఆర్థిక ఇంజన్లు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, పట్టణాల్లో అభివృద్ధి మరింత ప్రణాళికబద్ధంగా జరిగేందుకు చేపట్టే ప్రక్రియ నిరంతరమైనదని, దీన్ని ఎప్పటికప్పుడు స్థానిక పరిస్థితులు, ఆయా పట్టణాల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ముందుకు పోవాల్సి ఉంటుందని, ఈ దిశగా తెలంగాణ మున్సిపల్ శాఖ కూడా సంసిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా అధికారులకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
పట్టణాభివృద్ధి, భవిష్యత్ ప్లానింగ్ కి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆదర్శవంతమైన పద్ధతులు, చట్టాలను అధ్యయనం చేసేందుకు పురపాలక శాఖ ఉన్నతాధికారుల బృందం ఆయా రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ సూచించారు. ఇలాంటి విస్తృతమైన మేధోమధన సమావేశాలను నిర్వహించడం ద్వారా అధికారుల పనితీరు మరింత మెరుగుపడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్, భవిష్యత్తులో వివిధ అంశాలపైన ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని, వాటన్నింటికీ తాను స్వయంగా హాజరవుతానని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తో పాటు జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఎ, జలమండలి, డిటిసిపి తదితర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.