అర్హులైన వీధి వ్యాపారులందరికీ ప్రధాన మంత్రి ఆత్మ నిర్భర్ నిధి పథకం కింద జూలై ఒకటి నుంచి రుణాలు మంజూరు చేసేందుకు జీహెచ్ఎంసీ సన్నాహాలు చేస్తున్నది. ప్రస్తుతం నగర వ్యాప్తంగా వ్యాపారుల గుర్తింపునకు సర్వే చేపట్టారు. 16వ తేదీలోగా సర్వే పూర్తిచేసి గుర్తించిన వీధి వ్యాపారులకు వెండింగ్ సర్టిఫికెట్లు మంజూరు చేస్తారు. మరోవైపు, టౌన్ప్లానింగ్, ట్రాఫిక్ అధికారుల సమన్వయంతో వెండింగ్ జోన్ల గుర్తింపు ప్రక్రియ కూడా చేపట్టారు. ఇది పూర్తయితే వ్యాపారులు ఒక క్రమ పద్ధతిలో తమకు గుర్తించిన ప్రాంతాల్లో, నిర్ధారిత సమయాల్లో మాత్రమే విక్రయాలు సాగించాల్సి ఉంటుంది.
గతంలో 25,348 మందికి గుర్తింపు కార్డులు
గతంలో నిర్వహించిన సర్వే ప్రకారం నగరంలో 25,503 మంది వీధి వ్యాపారులు ఉండగా, అందులో 25,348 మందికి గుర్తింపు కార్డులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం నగర జనాభాలో 2.0 శాతం మంది వీధి వ్యాపారులు ఉండాల్సి ఉండగా, ఇప్పటి వరకు గుర్తించింది కేవలం 0.4 శాతం మాత్రమే కావడం విశేషం. ఈ నేపథ్యంలో అర్హులైలందరికీ లబ్ధి చేకూరేలా సర్వే చేపట్టారు. ఎన్జీవోలు, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ల సహకారంతో ఈనెల 16లోగా పూర్తిస్థాయిలో వీధి వ్యాపారుల సర్వే పూర్తి చేయాలని నిర్ణయించారు. అలాగే గుర్తించిన వీధి వ్యాపారులకు డిప్యూటీ కమిషనర్లు, డిప్యూటీ ప్రాజెక్ట్ అధికారుల ఆధ్వర్యంలో బ్యాంకుతో అనుసంధానం చేయాలని నిర్ణయించారు. సర్వేలో గుర్తించిన వీధి వ్యాపారుల డేటాను టౌన్ వెండింగ్ కమిటీలు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఆమోదించాల్సి ఉంటుంది. దీని కోసం జోన్లు, సర్కిళ్ల స్థాయిలో టౌన్ వెండింగ్ కమిటీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొవిడ్-19 నిబంధనలకు లోబడి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆత్మ నిర్భర్ నిధి పథకం లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాను రూపొందిస్తారు. అనంతరం ఈ జాబితాను రుణాలు మంజూరు చేసేందుకు సంబంధిత బ్యాంకులకు పంపిస్తారు. వ్యాపారుల అర్హతల ఆధారంగా రుణాలు మంజూరు చేస్తారని, ఇందులో సబ్సిడీ కూడా ఉంటుందని అధికారులు తెలిపారు. సర్వే వివరాలు ఎప్పటి కప్పుడు తెలంగాణ మెప్మా వెబ్సైట్లో నమోదు చేయాలని ప్రాజెక్టు అధికారులకు కమిషనర్ స్పష్టం చేశారు. జోనల్, డిప్యూటీ కమిషనర్లు ఈ కార్యకలాపాలన్నీ పర్యవేక్షించాలని, కేంద్ర ప్రభుత్వం నియమించిన అధికారులు తరచూ పురోగతిపై జోనల్, డిప్యూటీ కమిషనర్లతో సమీక్ష నిర్వహిస్తారని కమిషనర్ తెలిపారు.
సమన్వయంతో వెండింగ్ ప్లాన్..
జోనల్ కమిషనర్లు టౌన్ప్లానింగ్, ట్రాఫిక్ విభాగాల అధికారుల సమన్వయంతో జోనల్ స్థాయిలో సిటీ స్ట్రీట్ వెండింగ్ ప్లాన్ను రూపొందిస్తారు. లబ్ధిదారుల జాబితాలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వివిధ రకాల వీధి వ్యాపారులు తప్పని సరిగా ఉండేలా చూడాలి. రుణాలు పొందేందుకు వీలుగా వీరికి వెండింగ్ సర్టిఫికెట్లు జారీ చేస్తారు. డిప్యూటీ కమిషనర్లు టౌన్ లెవల్ బ్యాంకర్ల కమిటీ మీటింగ్ను ఏర్పాటు చేసి వీధి వ్యాపారులందరికీ ఖాతాలు తెరిచే విధంగా చర్యలు తీసుకోవడంతోపాటు ప్రధానమంత్రి పథకం ద్వారా రుణాలు లభించే విధంగా చర్యలు తీసుకుంటారు. అలాగే జోనల్ కమిషనర్లు ఆయా బ్యాంకుల కంట్రోలింగ్ అధికారులతో సమావేశాలు నిర్వహించి వచ్చే జూలై ఒకటో తేదీ నుంచి రుణాల వితరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ స్పష్టం చేశారు.