జమాత్ ఉద్ దువా చీఫ్ హఫీజ్ సయీద్ ఉగ్రవాదే అని పాక్ ప్రకటించింది
అంతర్జాతీయ సమాజం ఒత్తిడి నేపథ్యంలో ముంబై పేలుళ్ల(26/11) సూత్రధారి, జమాత్ ఉద్ దువా చీఫ్ హఫీజ్ సయీద్ ఉగ్రవాదే అని పాకిస్థాన్ తేల్చిచెప్పింది. జమాత్ ఉద్ దువా ప్రధాన కార్యాలయంతో పాటు 26 ప్రాంతీయ కార్యాలయాల ముందు ఉన్న బారికేడ్లను సోమవారం తొలగించినట్లు పాక్ ప్రకటించింది.
యూఎన్ఎస్సీ నిషేధం విధించిన జమాత్ ఉద్ దువా, లష్కరే తోయిబా, అల్ ఖైదా, తాలిబన్ ఉగ్రవాద సంస్థలతో పాటు పలు ఉగ్రవాద సంస్థలను ఉగ్రవాద జాబితాలో పాకిస్థాన్ చేర్చింది. ఈ మేరకు 1997 ఉగ్రవాద వ్యతిరేక చట్టానికి సవరణలు చేసింది. ఈ ఆర్డినెన్స్ పై ఆ దేశ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ సంతకం చేశారు. దీంతో ఈ విషయాన్ని పాక్ అధికారులు ధృవీకరించారు. హఫీజ్ సయీద్ బ్యాంకు లావాదేవీలను జప్తు చేసినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ ఉగ్రవాదిగా హఫీజ్ ను అమెరికా గుర్తించి అతనిపై 10 మిలియన్ డాలర్ల నజరానాను కూడా ప్రకటించింది. పాక్ రాజకీయాల్లో హఫీజ్ క్రియాశీలకంగా మారుతున్ననేపథ్యంలో పాక్ నిర్ణయం అతనికి పెద్ద సమస్యను తెచ్చిపెట్టినట్లే.