హిందూ వివాహాల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ను నవంబర్ 1 తేదీ నుంచి
హిందూ వివాహాల చట్టం ప్రకారం జరిగే పెండ్లిళ్ల రిజిస్ట్రేషన్ను మరింత పకడ్బందీగా అమలుచేసేందుకు రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ప్రయోగాత్మకంగా చేపట్టిన ఆన్లైన్ ప్రక్రియ విజయవంతమైంది. పదిరోజుల క్రితం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ అమలుతీరును పరిశీలించారు. అక్కడ మంచి ఫలితాలు రావడంతో అన్ని జిల్లాల్లో ఆన్లైన్ వివాహాల రిజిస్ట్రేషన్ ప్రారంభానికి కసరత్తు చేశారు. దాదాపు 500 మందికి పైగా ఈ విధానం ద్వారా వివాహ ధ్రువీకరణపత్రాలను పొందారు.
దీంతో ఈ విధానాన్ని నవంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలుచేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ కమిషనర్ చిరంజీవులు అధికారులను ఆదేశించారు. పెండ్లిళ్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకొనేవారు ముందుగా www.registration.telangana.gov.in లో స్లాట్ బుక్ చేసుకొని నిర్ణీత సమయానికి సంబంధిత రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఫారం నింపిన తర్వాత ముగ్గురు సాక్షులతో కలిసి సంబంధిత సబ్రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి నిమిషాల్లో వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ను పొందవచ్చు. ఈ విధానంతో విదేశాలకు వెళ్లేవారికి సాంకేతికపరమైన ఇబ్బందులు కూడా దూరమవుతాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ జాయింట్ కమిషనర్ వేముల శ్రీనివాసులు చెప్పారు.