సామాజిక,ఆర్థిక, కుల సర్వే” పై “మేధో మధనం” చర్చా వేదికలో –
రాష్ట్ర ప్రభుత్వం ఏ బాధ్యతను అప్పగించినా అంకిత భావం తో పని చేస్తా – తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు
సంచార జాతులుగా,నిరాశ్రయులుగా ఉన్న ప్రజలను ప్రత్యేకంగా గుర్తించి “కుల సర్వేలో” వివరాలు నమోదు చేయాలి.
రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన “మేథో మధన సభ”
- సామాజిక, ఆర్థిక కుల సర్వే తీర్మానం పై రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు, ధన్యవాదాలు తెలిపిన మేధావుల సభ.
- ఆధునిక, సాంకేతిక టూల్స్ తో “డిజిటలైజేషన్ పద్ధతి” ని అవలంబించాలి.
- మొబైల్ ఆప్ ను రూపొందించి, టాబ్స్ సహకారం తో వివరాలను సేకరించాలి.
*ఎప్పటి వివరాలు అప్పుడే ప్రధాన సర్వర్ లో నిక్షిప్తం చేయాలి. గోప్యత తో భద్రపరచాలి.
వారంలోపు ప్రభుత్వ కుల సర్వేపై రాష్ట్ర ప్రభుత్వానికి “నిపుణుల నివేదిక” అందచేయనున్నట్లు ప్రకటించిన మేధావుల సభ.
*త్వరలో బిసి సంఘాల, కుల ప్రతినిధుల సమావేశాల నిర్వహణకు నిర్ణయం.
వలసలతో, స్థిర నివాసం లేకుండా ఉపాధి అవకాశాలు ఉన్నచోట, జీవనాధారం లభిస్తున్న ప్రాంతాలలో నివాసం ఉంటున్న ప్రజలను ప్రత్యేకంగా గుర్తించాలి , ”సామాజిక, ఆర్థిక, కుల సర్వే” (కుల గణన) లో వారి వివరాలను నమోదు చేయాలని “ బహుజన మేథావుల సభ” రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏకగ్రీవ తీర్మానం తో కోరింది.
ఆదివారం నాడు భారతీయ ఓబీసీ సమాఖ్య ఆధ్వర్యంలో నగరంలోని ఖైరతాబాద్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్ “కాన్ఫరెన్స్ హాల్” లో “సామాజిక,ఆర్థిక, కుల సర్వే” పై “మేధో మధనం” పేరిట చర్చా వేదికను నిర్వహించారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం వరకు కొనసాగింది.. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే ఈ సర్వేలో పాటించాల్సిన విధి విధానాలు, కార్యాచరణ పై మేథావుల సభలో సుదీర్ఘ సమాలోచనలు చేశారు.కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, ప్రధాన వక్తగా మాజీ చైర్మన్ బి.ఎస్. రాములు పాల్గొన్నారు. వివిధ రంగాలకు చెందిన నిపుణులు, సామాజికవేత్తలు తమ అభిప్రాయాలను సమగ్రంగా వెలిబుచ్చారు. కార్యక్రమ సమన్వయకర్తగా భారతీయ ఓబీసీ సమాఖ్య అధ్యక్షుడు కె.కోటేశ్వరరావు వ్యవహరించారు.
సంచార,అర్థ సంచార ,విముక్త జాతులు,కులాలు నిరాశ్రయులుగా ఉన్నవారు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ది అందుకోలేక పోతున్న ప్రజలు, ఆధునిక అభివృద్ధి కి దూరంగా, ఇప్పటికీ లెక్కకు మించే పేదలు ఉన్నారు. వివక్షత, ఉదాసీన వైఖరి, అణిచివేతకు గురవుతున్న ప్రజలు ఉండడం సమాజానికి హితం కాదు. ఇలాంటి నిర్లక్ష్య వర్గాలను సమాజ ప్రగతి లో భాగస్వామ్యులను చేయడం ప్రజాస్వామ్య స్పూర్తి అని, మేథో మధనం లో సోదాహరణంగా సుదీర్ఘ చర్చ జరిగింది.
ఆధార్ కార్డులకు కూడా కనీస అర్హత లేనివారు,ఓటర్ల జాబితా లో కూడా నమోదుకు నోచుకోనివారు, బ్రతుకుతెరువు నిమిత్తం వలసలతో వీలైన ప్రదేశాలలో తాత్కాలిక పాకలు, గుడిసెలు, డేరాల క్రింద ఎలాంటి వసతులు లేకుండా నివసిస్తున్నవారు ఉన్నారు. వీధులలో, గుడుల ముందు భిక్షాటన తో బ్రతుకుతున్నవారు…ఇలాంటి వారి వివరాలను ప్రత్యేకంగా సేకరించి,”కుల సర్వే” లో నమోదు చేయాలని మేధావులసభ కోరింది. అలాంటప్పుడే “కులసర్వే” తో ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని “మేధోమధన సభ” అభిప్రాయ పడింది . ఆ దిశగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
కార్యక్రమంలో రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం మాట్లాడుతూ… ఇప్పటికే ఇలాంటి సర్వేల నిర్వహించిన, నిర్వహిస్తున్న… జనాభా గణన కమిషనర్ , 2011 కుల గణన, కర్ణాటక హెచ్ కాంతరాజా బిసి కమిషన్, హవనూర్, ఓ.చిన్నపరెడ్డి కమిషన్ లు, తమిళనాడుకు చెందిన సత్తనాథన్, అంబాశంకర్, జస్టిస్ జనార్దనం కమిషన్ లు, నేషనల్ శాంపిల్ సర్వే సంస్థ, బీహార్, ఆంద్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు కులసర్వే, కులగణనల నిమిత్తం అవలంభించిన పద్ధతులను సమగ్రంగా అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సూచనలతో నివేదిక సమర్పించనున్నట్లు కృష్ణ మోహన్ వివరించారు.
ఇప్పటికే తమ కమిషన్ తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల పర్యటనలలో భాగంగా సేకరించిన అంశాలను క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపారు. గౌరవ సుప్రీమ్ కోర్టు , వివిధ రాష్రాల హై కోర్ట్ లు ఇచ్చిన తీర్పులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. కుల సర్వే అంశం లో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విధి విధానాలను రూప కల్పన చేస్తున్నదో, ఇంకా స్పష్టత రావాల్సి ఉందని అన్నారు.ఇలాంటి సమావేశాలు ముందస్తుగా నిర్వహించడం వలన మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ బాధ్యతను అప్పగించినా అంకిత భావం తో పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు డాక్టర్ వకుళాభరణం వెల్లడించారు.
ఈ సభలో పలువురు మాట్లాడుతూ ….సర్వేలో వివరాలు సేకరిస్తున్నప్పుడు ఎలాంటి నిర్లక్ష్య ధోరణికి తావు లేకుండా అధికారులు వ్యవహరించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. పలు రాష్ట్రాలలో కుల సర్వేలు జరుగుతున్నప్పుడు వివరాల సేకరణ లో తప్పులు దొర్లినట్లు విమర్శలు ఎదుర్కొన్న సందర్భాలను గమనంలో ఉంచుకోవాలని వారు సూచించారు. 2011లో యు పి ఏ (కాంగ్రెస్)ప్రభుత్వం కులగణన చేపట్టింది. 5,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఆ గణన 2014 సంవత్సరం లో పూర్తయ్యింది. 2014 లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం 2011 కులగణన వివరాలను బయట పెట్టలేం అని చెప్పింది. తప్పులు దొర్లాయి అని తప్పించుకుంది. తిరిగి కులగణన చేయబోమని ప్రకటించింది.అందుచేతనే రాష్ట్రాలు కుల సర్వేల పేరిట ఇంటింటి సర్వేలు చేపట్టాల్సి వస్తుంది. ఈ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో సర్వే పూర్తి చేస్తే రాష్ట్రంలోని ప్రజలకు ,పేదవర్గాలకు మేలు జరుగుతుందని వక్తలు పేర్కొన్నారు.కుల సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ముందుకు రావడం పట్ల వక్తలు హర్షం వ్యక్తం చేసారు. ఇదొక చారిత్రాత్మక ప్రక్రియగా నిలుస్తుందన్నారు.