తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందితో సహా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లందరికీ (9,21,037 మందికి) 30 శాతం పీఆర్సీ ప్రకటిస్తూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు చేసిన ప్రకటనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
పెంచిన పీఆర్సీ వేతనాన్ని జూన్ నెల నుంచి అమలు చేసి చెల్లించాలని నిర్ణయించింది. నోషనల్ బెనిఫిట్ ను 1.7.2018 నుంచి, మానిటరీ బెనిఫిట్ ను 1.4.2020 నుంచి, క్యాష్ బెనిఫిట్ ను 1.4.2021 నుంచి అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయాలని అధికారులను ఆదేశించింది.
పెన్షనర్లకు 1.4.2020 నుంచి 31.5.2021 వరకు చెల్లించాల్సిన ఏరియర్స్ (బకాయిలను) 36 వాయిదాల్లో చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది.
కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవును మంజూరు చేయాలని నిర్ణయించింది. హెచ్ ఆర్ ఏ మీద పరిమితిని తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది.