కరోనా పరిస్థితులపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. జన సంచారం తగ్గించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. సినిమా హాళ్లు, పబ్బులు, బార్లలో రద్దీని తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు అడిగింది. ప్రభుత్వం సమర్పించిన నివేదికలో కనీస వివరాలు ఉండటం లేదని పేర్కొన్న కోర్టు.. పబ్బులు, మద్యం దుకాణాలే ముఖ్యమా? అని సూటిగా ప్రశ్నించింది.
రాష్ట్రంలో జన సంచారం నియంత్రణకు ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఏజీ కోర్టుకు తెలిపారు. ‘ప్రజల ప్రాణాలు గాల్లో తేలాడుతుంటే ఇంకెప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు? ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందా? లేక ఆదేశాలు ఇవ్వమంటారా?’ అని హైకోర్టు మండిపడింది. ప్రభుత్వ నిర్ణయాలను మధ్యాహ్నంలోగా నివేదించాలని ఆదేశించింది. భోజన విరామం తర్వాత తిరిగి విచారణ చేపడతామని.. మధ్యాహ్నం విచారణకు సంబంధిత అధికారులు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.