ఇంకెన్ని ప్రభుత్వ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగితే అధికారులు మేల్కొంటారు కుమారస్వామి
మరో ప్రభుత్వ హాస్టల్ లో నిర్వహణ లోపం కనిపించింది. వర్ధన్నపేట ఎస్టీ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ తో 50మందికి పైగా విద్యార్ధినులు అస్వస్థతకు గురయ్యారు. ఐదుగురు పిల్లల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. పిల్లలను ఎంజీఎంకు తరలించారు. మిగితా పిల్లలకు వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రి లో చికిత్స అందిస్తున్నారు.
వర్ధన్నపేట ఘటనపై జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్య వైఖరితో ఉన్న సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని అన్నారు. బాలికల హస్టల్ లో మొత్తం 190 మంది విద్యార్ధినులున్నారని.. వారికి కనీస సదుపాయాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశ్రమ పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం అందించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలం అయిందని అన్నారు కుమారస్వామి. ఫుడ్ పాయిజన్ తో వరుసగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. గురుకులాల్లో కనీస వసతులు ఏర్పాటు చేయాలని దుండ్ర కుమారస్వామి డిమాండ్ చేశారు. ఇంకెన్ని ప్రభుత్వ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగితే అధికారులు మేల్కొంటారని కుమారస్వామి ప్రశ్నించారు.
సోమవారం నాడు రాత్రి భోజనం చేసిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి భోజనం చేసే సమయంలో ఆహారంలో బల్లి అవశేషాలు కన్పించడంతో ఆందోళనకు గురై ఉంటారని వైద్యులు చెబుతున్నారు. విద్యార్ధినుల అస్వస్థతకు పుడ్ పాయిజన్ కారణమా లేదా అనే విషయాన్ని పరీక్షల తర్వాత చెబుతామని వైద్యులు ప్రకటించారు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతన్న విద్యార్ధినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు. ఈ ఏడాది జూలై 29వ తేదీన మహబూబాబాద్ గిరిజన బాలికల పాఠశాలలో పుడ్ పాయిజన్ జరిగింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా అస్వస్థత పాలయ్యారు. వారిని వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. జూలై 16న బాసర ట్రిపుల్ ఐటీలో పుడ్ పాయిజన్ తో ఓ విద్యార్ధి మరణించాడు. పలువురు విద్యార్ధులు అస్వస్థతకు గరయ్యారు. ఈ ఏడాది జూన్ 27న సిద్దిపేట జిల్లాలోని మైనారిటీ బాలికల స్కూల్ లో పుడ్ పాయిజన్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో 128 మంది విద్యార్ధినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఏడాది మార్చి 13న ఆదిలాబాద్ భీంపూర్ కేజీబీవీలో 70 మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. ఇలాంటి ఎన్నో ఘటనలు విద్యార్థుల్లోనూ, వారి తల్లిదండ్రుల్లోనూ తీవ్ర ఆందోళనకు కారణమవుతూ ఉన్నాయి.