బీసీల రిజర్వేషన్స్ కోసం ఏమి చేయడానికైనా సిద్ధమే.. న్యాయం కోసం ఎవరితో అయినా యుద్ధమే: దుండ్ర కుమారస్వామి
సామాజిక రిజర్వేషన్లు రక్షించుకోవడానికి దేశవ్యాప్తంగా పోరాటం
తరతరాలుగా బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంది. న్యాయం కోసం బీసీ నాయకులు ప్రాణాలనే అర్పించారు. అయినా కూడా ప్రభుత్వాల్లో మార్పు రావడం లేదు. గత రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ బీసీలకు చేసింది శూన్యమే.. ఈ టర్మ్ లో కూడా ఆయన బీసీలకు మొండి చేయి చూపిస్తామంటే మాత్రం బీసీలు ఊరికే ఉండే ప్రసక్తే లేదని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి తెగేసి చెప్పారు. ఎంత మంది జనం ఉన్నారో అంత మందికి తగ్గట్టుగా చట్టాలు రూపుదిద్దుకుంటూ ఉంటాయి.. సింహభాగం ఉన్న బీసీలకు అందాల్సిన అభివృద్ధి ఫలాలు అందకుండా చేయాలని అనుకుంటే మాత్రం ప్రజాగ్రహం తప్పదు.
బిహార్లో 65 శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తున్నట్లు ఇచ్చిన తీర్పు పట్ల ఎంతో బాధపడుతూ ఉన్నామని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి తెలిపారు. బిహార్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 65 శాతానికి పెంచడాన్ని కొందరు తట్టుకోలేకపోయారని.. అందుకే హైకోర్టును ఆశ్రయించారన్నారు. బిహార్లో కులగణన తర్వాత విద్య, ఉద్యోగ రంగాల్లో కల్పిస్తున్న రిజర్వేషన్లను పెంచుతూ సవరణ బిల్లును తీసుకొచ్చారు. రాష్ట్ర అసెంబ్లీ, రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఎస్సీలు, ఎస్టీలు, ఇతర వెనకబడిన, అణగారిన వర్గాల రిజర్వేషన్లు 50 శాతం నుంచి 65 శాతానికి పెరిగాయి. బిహార్ లో బీసీలు అధికంగా ఉన్న కారణంగానే అక్కడి బీసీలకు న్యాయం జరుగుతుంది తప్ప మరింకేమీ కాదని దుండ్ర కుమారస్వామి తెలిపారు. కోర్టు తీర్పు బాధాకరంగా అనిపించిందని.. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా బీసీలకు దక్కాల్సిన న్యాయం దక్కపోవడం చాలా బాధ కలిగించే అంశమని ఆక్షేపించారు.
బడుగు, బలహీనవర్గాల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పు రావడం బాధపెట్టినా.. సామాజిక రిజర్వేషన్లు రక్షించుకోవడానికి దేశవ్యాప్తంగా పోరాటం చేయడానికి జాతీయ బీసీ దళ్ సమాయత్తమవుతూ ఉందన్నారు దుండ్ర కుమారస్వామి. బీసీ రిజర్వేషన్లు 65 శాతానికి పెంచడాన్ని రద్దు చేస్తూ బిహార్ హైకోర్టు తీర్పు ఇవ్వడం సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకమనే విషయాన్ని దేశ ప్రజలందరూ చూస్తున్నారు. ఈడబ్ల్యూఎస్కు 10 శాతం కల్పించిన సందర్భంలో రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండడం సబబేనని సుప్రీంకోర్టు ఫుల్బెంచ్ ఇచ్చిన తీర్పు మరచిపోలేరని తెలుసుకోవాలి.
ఏది ఏమైనా బీసీలకు దక్కాల్సినవి దక్కకుంటే కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేయడానికైనా సిద్ధమే. బీసీలకు జరగాల్సిన న్యాయం, దక్కాల్సిన ప్రతి ఒక్కటీ దక్కేదాకా మా పోరాటం ఆగదు. గ్రామ స్థాయి నుండి మొదలైన ఢిల్లీ దాకా వెళ్లబోతోందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. త్వరలోనే బీసీ దళ్ ప్రణాళికను ప్రజలందరితో పంచుకుంటాం. ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా బీసీ నాయకులంతా మా పోరాటంలో భాగమవుతూ ఉన్నారు.



