“ఓబీసీల సామాజిక న్యాయం సాధనకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది” – AICC OBC Chairman డా. అనిల్ జైహింద్ యాదవ్
“బీసీ సమస్యలపై కేంద్రం పై ఒత్తిడి తీసుకురావాలి” – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి
హైదరాబాద్లోని The Westin Hyderabad Mindspace హోటల్లో జరిగిన కీలక సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, సామాజిక న్యాయం మరియు రాజకీయ ప్రతినిధిత్వంపై జాతీయ స్థాయి చర్చ జరిగింది.
ఏఐసీసీ ఓబీసీ విభాగం చైర్మన్ డా. అనిల్ జైహింద్ యాదవ్ హైదరాబాద్కు విచ్చేసిన సందర్భంగా, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు మరియు బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పలు జాతీయ మరియు రాష్ట్ర స్థాయి సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో పలువురు నాలుగు రాష్ట్రాల నుండి బీసీ సంఘాల నాయకులు, మేధావులు, ప్రజా సంఘాలు ,న్యాయవాదులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దుండ్ర కుమారస్వామి దేశవ్యాప్తంగా బీసీల అభివృద్ధికి అవసరమైన పలు కీలక అంశాలను వివరంగా ప్రస్తావిస్తూ ఒక సమగ్ర రిప్రెజెంటేషన్ను సమర్పించారు.
బీసీల హక్కులు, రిజర్వేషన్లు,సామాజిక సమానత్వం, రాజకీయ ప్రతినిధిత్వం మరియు సంక్షేమానికి సంబంధించిన అనేక ముఖ్యమైన డిమాండ్లను ఆయన రాతపూర్వకంగా అందజేశారు.
సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు:
• తెలంగాణలో జనాభా ప్రాతిపదికన బీసీలకు 42% రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి.
• దేశవ్యాప్తంగా నిర్వహించే జనగణనలో కుల గణన నిర్వహించి అందులో ప్రత్యేకంగా ఓబీసీ కాలమ్ చేర్చాలి.
• బీసీల సంక్షేమం కోసం కేంద్ర స్థాయిలో ప్రత్యేక ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి.
• పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి.
• బీసీల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి.
• బీసీల సంప్రదాయ వృత్తులు మరియు చిరు వ్యాపారాలను రక్షించేందుకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలి.
• బీసీ కార్పొరేషన్లను బలోపేతం చేసి బీసీ యువతకు సులభ రుణాలు మరియు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలి.
• విద్యా రంగంలో మరియు ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీ రిజర్వేషన్లను కచ్చితంగా అమలు చేయాలి.
• కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకత్వాన్ని అభివృద్ధి చేసే జాతీయ స్థాయి వేదిక ఏర్పాటు చేయాలి.
• తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పంపిన బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులు త్వరగా అమలయ్యేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి.
అదే సమయంలో రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న కుమ్మరి సంఘానికి సంబంధించిన ఘటనపై కూడా స్పందిస్తూ, బాధితులకు న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని దుండ్ర కుమారస్వామి కోరారు.
ఈ సందర్భంగా స్పందించిన డా. అనిల్ జైహింద్ యాదవ్, దుండ్ర కుమారస్వామి ప్రస్తావించిన అంశాలను శ్రద్ధగా విన్నామని తెలిపారు. సమర్పించిన రిప్రెజెంటేషన్ను పరిశీలించి బీసీల హక్కుల సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో చోటుచేసుకున్న కుమ్మరి సంఘ ఘటనపై కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సమావేశంలో బీసీ సంఘాల నేతలు, కుల సంఘాల ప్రతినిధులు సమర్పించిన రిప్రెజెంటేషన్లను కూడా ఆయన స్వీకరించారు. ఈ చర్చలు బీసీ హక్కుల సాధనకు జాతీయ స్థాయిలో కొత్త దిశను చూపుతాయని నాయకులు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో సామాజిక తెలంగాణ ఇంటెలెక్టువల్ ఫోరం ప్రతినిధులు, ప్రముఖ బీసీ సంఘాల నాయకులు, మేధావులు మరియు నాలుగు రాష్ట్రాల నుండి వచ్చిన ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
బీసీల ఐక్యతతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని వారు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా బీసీల హక్కుల సాధన కోసం సమగ్ర ఉద్యమం అవసరమని, అదే లక్ష్యంగా ఈ సమావేశం కీలక అడుగుగా నిలిచిందని నాయకులు పేర్కొన్నారు.
