ప్రగతి భవన్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఇవాళ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఏడున్నర గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో పలు అంశాలపైన మంత్రిమండలి చర్చించి నిర్ణయాలు తీసుకున్నది.
కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ఉద్యోగుల జిల్లాల వారీ కేటాయింపులు, నూతన జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపులు, మరియు అధికారుల కేటాయింపులు చేపట్టాల్సిందిగా టీఎన్ జీవో, టీజీవో ప్రతినిధులు సీఎంకు చేసిన విజ్ఞప్తిని పురస్కరించుకుని అందుకు సంబంధించి కేబినెట్ చర్చించింది. ఉద్యోగ సంఘాల కోరిక మేరకు జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపు, అధికారుల కేటాయింపును సత్వరమే చేపట్టాలని, ఖాళీల గుర్తింపు మరియు భర్తీ ప్ర్రక్రియ సత్వరమే జరగాలని కేబినెట్ ఆదేశించింది.
అన్ని రకాల పోస్టులలో ఖాళీలను గుర్తించిన తర్వాత ప్రతి సంవత్సరం రిక్రూట్ మెంట్ కోసం ‘వార్షిక క్యాలెండర్’ ను తయారు చేయాలని, ఉద్యోగాల ఖాళీల భర్తీకై ‘వార్షిక నియామక కేలెండర్’ (Annual Recruitment Calendar) (జాబ్ కేలెండర్) ను తయారు చేసి అందుకు అనుగుణంగా విధిగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిర్వహించాలని కేబినెట్ ఆదేశించింది.
ఉద్యోగ ఖాళీల భర్తీకై చేపట్టాల్సిన చర్యలు, ఖాళీల గుర్తింపు కొరకు బుధవారం జరిగే సమావేశానికి అన్ని శాఖల కార్యదర్శులను పూర్తి వివరాలతో హాజరు కావాలని కేబినెట్ ఆదేశించింది.