తెలంగాణ రాష్ట్రంలో రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. నేటి నుండి నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. నైట్ కర్ఫ్యూ కారణంగా దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్స్, మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబ్స్, ఫార్మాసూటికల్స్, నిత్యావసర సరుకులకు నైట్ కర్ఫ్యూ నుండి మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం.
మీడియా, టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ సర్వీసెస్, ఐటీ, ఈ కామర్స్ వస్తువుల పంపిణీ, పెట్రోల్ బంకులు, ఎల్పీజీ, సీఎన్జీ గ్యాస్ స్టేషన్లకు కూడా మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం. విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా విభాగాలు, వాటర్ సప్లై, శానిటేషన్, కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌజేస్, ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసెస్ లకు నైట్ కర్ఫ్యూ నుండి మినహాయింపు లభించింది.మెడికల్ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది తమ వెంట గుర్తింపు కార్డులు ఉంచుకోవాలని ప్రభుత్వం సూచించింది.
కరోనా కేసుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తెలంగాణ హైకోర్టు సోమవారం నాడు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కర్ప్యూ లేదా వీకేండ్ లాక్ డౌన్ విధిస్తారా లేదా తామే నిర్ణయం తీసుకోవాలా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. 48 గంటల్లో ఈ విషయమై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రాత్రి నుండి నైట్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయం తీసుకొంది.