స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని, సోమవారం జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించిన అనంతరం తేదీలపై స్పష్టత ఇస్తామని మంత్రి తెలిపారు. ఈ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను తప్పకుండా అమలు చేయాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి డిమాండ్ చేశారు.
మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని, వీటిలో 42% బీసీ రిజర్వేషన్లను తప్పనిసరిగా అమలు చేయాలని దుండ్ర కుమారస్వామి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. బీసీ నాయకులు గ్రామాల్లో సిద్ధంగా ఉండి, ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని ఆయన పిలుపునిచ్చారు. రిజర్వేషన్లు అమలు చేయకపోతే కాంగ్రెస్ పై బీసీల నమ్మకం సడలుతుందని హెచ్చరించారు.
రాష్ట్ర చట్టసభలు ఆమోదించిన బీసీ బిల్లులను కేంద్రం త్వరగా పూర్తి చేయాలని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని దుండ్ర కుమారస్వామి సూచించారు. సామాజిక తెలంగాణ సాధన కోసం విద్యార్థులు, యువత, మేధావులు కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీలకు న్యాయమైన ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని, ఈ ఎన్నికలు బీసీలకు అవకాశంగా మారాలని ఆయన తెలిపారు.