సంకటనాశన గణేశ స్తోత్రం అత్యంత ప్రాముఖ్యత గల స్తోత్రం.ఇది ప్రతిరోజు పఠించిన వారికి సకల సంపదలు కల్గి, అన్ని కోరికలు తీరుతాయని పురాణాల్లో చెప్పబడింది. వినాయకున్ని అనేక పేర్లతో పిలుస్తారు. గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు, గణనాథుడు, పిల్లైయార్ ఇవన్నీ వినాయకుని పేర్లే. వినాయకున్ని విఘ్నాలు రాకుండా కాపాడే దేవునిగా కొలుస్తారు. అందుకే విఘ్నేశ్వరుడని పేరు వచ్చింది. బుద్ధి, విజ్ణానాన్ని ప్రసదించే దేవునిగా ప్రసిద్ధి. ఏ పూజ ప్రారంభించినా మొదట గణేశున్ని పూజించడం ఆనవాయితీ.
సంకటనాశన గణేశస్తోత్రం నారదపురాణంలోనిది. నారదపురాణాన్ని వేదవ్యాసుడు రచించాడు. ఈ పురాణంలో 25,000 శ్లోకాలు కలవు. ఈస్తోత్రం నారదునిచే చెప్పబడినది.
గణేశస్తోత్రం:
నారద ఉవాచ –
ప్రణమ్య శిరసా దేవం , గౌరీపుత్రం వినాయకమ్,
భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్థసిద్ధయే.
ప్రథమం వక్రతుండం చ, ఏకదంతం ద్వితీయకమ్,
తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్.
లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ,
సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తథాష్టమమ్.
నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకమ్,
ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్.
ద్వాదశ ఈతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః,
న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికారకం ప్రభో !
విద్యార్థీ లభతే విద్యాం, దనార్థీ లభతే ధనమ్,
పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిమ్.
జపేత్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్,
సంవత్సరేణ సిద్ధిం చ, లభతే నాత్ర సంశయః.
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్,
తస్య విద్యా భవేత్ సర్వా, గణేశస్య ప్రసాదతః
ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశన గణేశస్తోత్రం సంపూర్ణమ్
సంకటనాశన గణేశ స్తోత్రం తెలుగు భావం:
నారదుడు ఈ విధంగా పలికెను: ఆయుస్సు పెరగాలని ఐశ్వర్యం కలగాలని, కోరికలు నెరవేరాలని కోరుకునే భక్తులు నిత్యం పార్వతీ పుత్రుడైన వినాయకునికి శిరస్సువంచి ప్రణమిల్లవలెను.
మొదట: వంకర తిరిగిన తొండము కలవానిగా, రెండు- ఒకే దంతము కలవానిగా, మూడు: నల్లని ఎరుపెక్కిన కన్నులు కలవానిగా, నాలుగు- ఏనుగు ముఖం కలవానిగా, గణేశున్ని భావింపుము.
ఐదు: పెద్ద పొట్ట కలవానిగాను, ఆరు- శత్రువుల పట్ల క్రూరంగా ప్రవర్తించు వానిగా, ఏడు: విఘ్నములను తొలగించువానిగా, ఎనిమిది: పొగవంటి తెల్లని శరీర కాంతి కలవానిగా వినాయకున్ని భావించవలెను.
తొమ్మిది: బాలచంద్రరేఖ నుదుటన కలవానిగా, పది- విశిష్టమైన నాయకునిగా, పదకొండు: ప్రథమ గణములకు అధిపథిగా,
పన్నెండు: ఏనుగు ముఖము కలవానిగా వినాయకున్ని భావింపుము.
ఈ పన్నెండు నామాలను ఎవరైతే ప్రాత: కాలము, మధ్యాహ్నము మరియూ సంధ్యా కాలములలో చదువుతారో వారికి విఘ్నభయముండదు. వారు కోరినది సిద్ధించును. విద్యను కోరిన వారికి విద్యయు, ధనమును కోరిన వారికి ధనము లభించును.
సంకటనాశన గణేశ స్తోత్రం పఠిస్తే ఆరునెలలలో ఫలితం లభించును. సంవత్సరం పఠిస్తే కోరికలు నెరవేరును అనడం లో సందేహం లేదు.
ఈ స్తోత్రం వ్రాసి ఎనిమిదిమంది బ్రాహ్మణులకు సమర్పించినచో, గణేశుని అనుగ్రహము వలన అట్టివారికి అన్ని విద్యలు కలుగును. విజ్ణాన వంతులగుదురు.