బ్లిస్బర్గ్ – ఫ్యూచర్ ఆఫ్ హోప్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది పురస్కారాలు
ఐటీ నిపుణులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులకు అవార్డులు
ముఖ్య అతిథిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థ బ్లిస్బర్గ్ – ఫ్యూచర్ ఆఫ్ హోప్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. హైటెక్ సిటీ మాదాపూర్లోని సైబర్ గేట్ వేలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ఐటీ నిపుణులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఉగాది అవార్డులు అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగంలో ప్రతిభ కనబరుస్తున్న నిపుణులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సైబర్ గేట్ వేలో ఐటీ నిపుణులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు సాంప్రదాయ దుస్తులతో పాల్గొని ఉత్సాహంగా ఉగాది వేడుకలను జరుపుకున్నారు. ముగ్గుల పోటీలు, సాంప్రదాయ ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా, విజేతలకు ప్రత్యేక అవార్డులు అందజేశారు. అలాగే తమ తమ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ ఉగాది పండుగ ప్రాముఖ్యతను వివరించారు.

“ఉగాది అంటే సృష్టి ఆరంభమైన పవిత్ర దినం. కొత్త సంవత్సరానికి నాంది పలికే రోజు మన జీవితాల్లో కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు, కొత్త సంకల్పాలకు శ్రీకారం చుడుతుంది. ఇది మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులకు నిలువెత్తు నిదర్శనం. ఇలాంటి పండుగను సాంప్రదాయ దుస్తులతో, ఆటల పోటీలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో జరుపుకోవడం మన సంస్కృతికి గొప్ప గుర్తింపు” అని తెలిపారు.
ఉగాది మనకు గొప్ప జీవన సందేశాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. “గతంలో జరిగిన సంఘటనలను పాఠంగా తీసుకుని భవిష్యత్తును ధైర్యంగా నిర్మించుకోవాలి. యువత తమ జీవితానికి స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకుని దృఢ సంకల్పంతో కృషి చేయాలి. పేదరికం, అన్యాయం, అసమానతలపై పోరాడే శక్తి విద్యలో ఉంది. చదువు మనకు ఆత్మగౌరవాన్ని పెంచి అవకాశాలు, నాయకత్వాన్ని ఇస్తుంది. అందుకే విద్యను ఆయుధంగా మార్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి” అని సూచించారు. అలాగే యువత సమయాన్ని విలువైనదిగా వినియోగించుకోవాలని చెప్పారు. “సమయాన్ని సరిగ్గా వినియోగిస్తే భవిష్యత్తు ప్రకాశవంతంగా మారుతుంది. కష్టం, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఏ లక్ష్యమైనా సాధ్యమే” అని అన్నారు.
సమాజంలో మార్పు రావాలంటే యువత ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిస్తూ, “ఐక్యతే అసలైన బలం. నాయకత్వం యువత నుంచే రావాలి. మన ఎదుగుదలతో పాటు సమాజం కూడా ఎదగాలి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం యువత ముందుకు రావాలి” అని తెలిపారు.
యువతలో ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉండాలని సూచిస్తూ, “విజయం సాధించాలంటే మనపై మనకు నమ్మకం ఉండాలి.