.
ఆధ్యాత్మిక విశ్వశాంతి కోసం ప్రపంచ గురువుల ప్రార్థన – ప్రకృతి సంరక్షణకు పిలుపు- డాక్టర్ హరి కుమార్
ప్రపంచంలో శాంతి, సౌభ్రాతృత్వం, మానవతా విలువలు నిలవాలంటే ఆధ్యాత్మికతే ప్రధాన మార్గమని ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ హరి కుమార్ అన్నారు. వైద్యులు మరియు ఆధ్యాత్మిక గురువుల సమిష్టి వేదిక అయిన “విశ్వ శాంతి ఏకత్వ ధ్యాన సంగమం” ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురువులు, వైద్యులు కలిసి మొక్కలు నాటి ప్రకృతి సంరక్షణకు నూతన సందేశం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో 111 సంవత్సరాల హిమాలయ యోగి సదానంద గిరి, డా. మాతాజీ, శివ రుద్ర స్వామిజీ, గోమాత సంరక్ష శివ పార్వతి మాతాజీ, ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పీ. పట్నాయక్, వైద్య నిపుణులు డా. హరి కుమార్, డా. స్రవంతి, డా. లక్ష్మీ నాయుడు, పలువురు వైద్యులు, సినీ ప్రముఖులు, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ హరి కుమార్ మాట్లాడుతూ –
“మనిషి శరీరానికి ఆరోగ్యం ఎంత ముఖ్యమో, సమాజానికి ఆధ్యాత్మికత అంతే ముఖ్యమైనది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే ప్రపంచంలో శాంతి నెలకొంటుంది. అదే ఆధ్యాత్మికత ఇచ్చే గొప్ప వరం. నేటి వేగవంతమైన జీవితంలో మనుషులు మానసిక ప్రశాంతత కోసం వెతుకుతున్నారు. ఆ ప్రశాంతతకు ప్రకృతి, ఆధ్యాత్మికత రెండూ అవినాభావంగా ఉన్నాయి” అని అన్నారు.
ఇప్పటి కాలంలో నగరాలు కాంక్రీట్ అడవులుగా మారుతున్నాయని, రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం ఇవ్వాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. మొక్కలు కేవలం ప్రకృతిని కాపాడడమే కాకుండా, భూమిపై ఉన్న ప్రతి జీవరాశికి జీవనాధారంగా నిలుస్తాయని తెలిపారు.
ఈ సందర్భంగా ఒక చిన్న కథను చెబుతూ డాక్టర్ హరి కుమార్ అందరికీ సందేశం ఇచ్చారు:
“ఒక రైతు పక్షులను పెంచాడు… కొద్ది రోజులకు అవి ఎగిరి వెళ్లిపోయాయి. ఉడతను పెంచాడు… అది కూడా వెళ్లిపోయింది. కోతులను పెంచాడు… అవి కూడా దూరమయ్యాయి. చివరికి ఒక చెట్టును నాటాడు. కొంతకాలం తరువాత అదే పక్షులు, ఉడతలు, కోతులు అన్నీ వచ్చి ఆ చెట్టు నీడలో చేరాయి. అందుకే చెట్టు అంటే కేవలం మొక్క కాదు… అది అన్ని జీవరాశులకు జీవం ఇచ్చే ఆలయం” అని డాక్టర్ హరి కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోఆర్డినేటర్ గర్రెపల్లి సతీష్ సహా పలువురు పాల్గొని మొక్కలు నాటి ప్రకృతి సంరక్షణకు సంకల్పం చేశారు.ఆధ్యాత్మికత – ప్రకృతి – మానవతా విలువలు కలిసినప్పుడే ప్రపంచంలో నిజమైన శాంతి సాధ్యమవుతుందని ఈ కార్యక్రమం స్పష్టంగా తెలియజేసింది.