మెదక్ జిల్లా KGBVలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు
విద్యార్థినుల ఆరోగ్య భద్రతపై నిర్లక్ష్యం – బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
మెదక్ జిల్లా రేగోడు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, హైదరాబాద్కు ఫిర్యాదు సమర్పించినట్లు జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు మరియు న్యాయవాది దుండ్ర కుమారస్వామి తెలిపారు.(HRC portal video dairy no; 279/IN/2026-HRCNET).
20 ఫిబ్రవరి 2026న జరిగిన ఈ ఘటనలో ఉదయం విద్యార్థినులు ఉప్మా తీసుకున్న అనంతరం సుమారు 25 మంది విద్యార్థినులు వాంతులు, అస్వస్థతకు గురయ్యారని, వారిలో 10 మంది పరిస్థితి విషమించిందని సమాచారం అందిందన్నారు. ఈ ఘటన అత్యంత ఆందోళనకరమైనదిగా ఆయన పేర్కొన్నారు.
ఈ సంఘటన విద్యార్థినుల ప్రాథమిక హక్కులైన ఆరోగ్యం, భద్రత మరియు గౌరవప్రదమైన జీవన హక్కులకు విఘాతం కలిగించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పదేపదే ఎందుకు జరుగుతున్నాయో సూక్ష్మంగా విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఈ ఘటనపై స్వతంత్ర మరియు సమగ్ర విచారణ చేపట్టాలని, నిర్లక్ష్యం వహించిన బాధ్య అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని, పాఠశాలలో తాగునీరు, ఆహార నాణ్యత మరియు పారిశుద్ధ్య పరిస్థితులపై అత్యవసర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధిత విద్యార్థినులకు తగిన కార్పొరేట్ స్థాయి వైద్య సహాయం మరియు మానసిక పరిరక్షణ అందించాలన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేయాలని సూచించారు.
విద్యార్థినుల ప్రాణ భద్రత మరియు ఆరోగ్యాన్ని కాపాడడం ప్రభుత్వం మరియు విద్యాసంస్థల ప్రధాన బాధ్యత అని పేర్కొంటూ, పై ఘటనను మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన వినమ్రంగా కోరారు.