మహిళా సాధికారతకు అద్భుత వేదిక
“మహిళలు ఎవరి అండ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు.. తమలోని శక్తిని నమ్మి, తమ భవిష్యత్తును తామే నిర్మించుకోవాలి. జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు..
మహిళల ప్రతిభ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలకు వేదికగా సిగ్నేచర్ జెడ్ఎస్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ప్రముఖ రాడిసన్ హోటల్లో మహిళా సాధికారత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయస్థాయి సదస్సును తలపించేలా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు, ప్రతిభ కనబరిచిన మహిళలను సత్కరించి అవార్డులు అందజేశారు. మహిళలు ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధి సాధించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని, సమాజం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని కార్యక్రమంలో వక్తలు పేర్కొన్నారు. మహిళల ప్రతిభకు గుర్తింపు, వారి ఆత్మవిశ్వాసానికి ప్రోత్సాహం, నాయకత్వ లక్షణాలకు అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశంగా నిలిచింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి హాజరై మహిళా సాధికారతపై స్ఫూర్తిదాయక సందేశాన్ని అందించారు. ప్రతి మహిళ తన భవిష్యత్తును తానే నిర్ణయించుకునే స్థాయికి ఎదగాలని, తన జీవితానికి తానే సంతకం చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచం మనల్ని నమ్మే ముందు మనల్ని మనం నమ్మాలని, ఆత్మవిశ్వాసమే విజయానికి తొలి మెట్టని అన్నారు. ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు సాగితే గొప్ప విజయాలు సాధించవచ్చని, పెద్ద పెద్ద కలలు కనడంతో పాటు వాటిని సాకారం చేసుకునేందుకు నిరంతరం కృషి చేయాలని సూచించారు. ప్రతి పెద్ద విజయానికి మొదటి అడుగు చిన్నదేనని, ఆ చిన్న అడుగును ధైర్యంగా ముందుకు వేయాలని ప్రేరణనిచ్చారు.
అవకాశం కోసం ఎదురు చూడకుండా అవకాశాన్ని సృష్టించుకునే స్థాయికి మహిళలు ఎదగాలని దుండ్ర కుమారస్వామి ఆకాంక్షించారు. అవకాశం వచ్చినప్పుడు వెనుకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు సాగాలని, జీవితంలో ఎదురయ్యే అపజయాలను ముగింపుగా భావించకుండా మరింత బలంగా తిరిగి నిలబడాలని సూచించారు. మన సామర్థ్యాన్ని తక్కువగా చూసేవారికి మాటలతో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, మన కృషి, మన విజయం, మన ఎదుగుదలే అందుకు గొప్ప సమాధానాలని అన్నారు. “ఒక మహిళను ప్రోత్సహిద్దాం.. ఒక అమ్మాయికి అవకాశం కల్పిద్దాం.. ఒక మహిళకు తన హక్కుల గురించి తెలియజేద్దాం.. ఒక జీవితంలో మార్పుకు కారణమవుదాం” అనే సందేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
“ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో.. అక్కడ దేవతలు సంచరిస్తారు” అనే భావనను ఆచరణలో చూపించాల్సిన సమయం ఇదేనని కార్యక్రమంలో పేర్కొన్నారు. మహిళను ప్రోత్సహించడం అంటే ఒక వ్యక్తిని మాత్రమే ముందుకు తీసుకెళ్లడం కాదని, ఒక కుటుంబాన్ని, ఒక తరాన్ని, చివరకు ఒక సమాజాన్ని ముందుకు నడిపించడమేనని నిర్వాహకులు తెలిపారు. “మీ జీవిత పుస్తకంలో మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు.. మీ కథను మరెవరూ రాయకూడదు; మీ జీవితంపై మీ సంతకం మీరే చేయాలి” అనే శక్తివంతమైన సందేశంతో కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా ముగిసింది. మహిళల విజయాలను గుర్తించి, మరెందరో మహిళలకు స్ఫూర్తిగా నిలిచేలా కార్యక్రమాన్ని నిర్వహించిన సిగ్నేచర్ జెడ్ఎస్ ఈవెంట్స్ నిర్వాహకులను అభినందించారు.





