జాతీయ జనగణనలో బీసీ/ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలి
కేంద్రంపై ఒత్తిడి కోసం జాతీయ స్థాయిలో మహా ఉద్యమం చేపట్టాలి: దుండ్ర కుమారస్వామి
జాతీయ జనగణనలో బీసీ/ఓబీసీలను చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తెలంగాణ శాసనసభ తీర్మానం చేయడం స్వాగతించదగిన పరిణామమని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ రిజర్వేషన్ సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి అన్నారు. శనివారం తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీ తీర్మానాన్ని స్వాగతిస్తూనే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి దేశవ్యాప్తంగా బీసీ సంఘాలు, సామాజిక సంస్థలు, ప్రజా ప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని జాతీయ స్థాయిలో మహా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.
2027లో నిర్వహించనున్న జాతీయ జనగణనలో బీసీ/ఓబీసీల కోసం ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేసి, కులాల వారీగా సమగ్ర సమాచారాన్ని సేకరించాలని దుండ్ర కుమారస్వామి డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా గుర్తించిన బీసీ కులాల జాబితాల ఆధారంగా జనాభా వివరాలను నమోదు చేయాలని కోరారు. జనగణన ప్రశ్నావళిలో బీసీ/ఓబీసీలకు ప్రత్యేక కేటగిరీని చేర్చడం ద్వారా దేశంలోని బీసీల సామాజిక, ఆర్థిక, విద్యా స్థితిగతులపై స్పష్టమైన గణాంకాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
బీసీల సమస్యపై తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి అన్ని రాజకీయ పార్టీలను, బీసీ సంఘాలను ఒకే వేదికపైకి తీసుకురావాలని దుండ్ర కుమారస్వామి కోరారు. తెలంగాణలో 2024లో నిర్వహించిన కుల సర్వే అనుభవాలను పరిగణనలోకి తీసుకొని, కులాల వారీగా ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించే శాస్త్రీయ విధానాన్ని జాతీయ జనగణనలో అమలు చేయాలని సూచించారు. 2011 సామాజిక, ఆర్థిక, కుల గణనలో ఎదురైన సమాచార క్రమబద్ధీకరణ సమస్యలను పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు.
దేశ జనాభాలో బీసీల వాస్తవ స్థితిగతులు, వారి వెనుకబాటుతనం, అవసరాలు, అభివృద్ధి అవకాశాలను గుర్తించేందుకు కులాల వారీగా విశ్వసనీయమైన జనాభా గణాంకాలు ఎంతో అవసరమని దుండ్ర కుమారస్వామి పేర్కొన్నారు. విద్య, ఉపాధి, సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయ విధానాల రూపకల్పనకు ఈ గణాంకాలు కీలక ఆధారంగా నిలుస్తాయని తెలిపారు. బీసీల హక్కుల సాధన కోసం అన్ని వర్గాలు కలిసికట్టుగా జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్యబద్ధమైన మహా ఉద్యమాన్ని చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

