బీపీ మండల్ జయంతి సందర్భంగా ఘన నివాళి
బీపీ మండల్ రిజర్వేషన్ల పితామహుడు, బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవమని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి అన్నారు. బీపీ మండల్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీపీ మండల్ ఒక వ్యక్తి మాత్రమే కాదని, ఒక ఉద్యమం, ఒక సామాజిక విప్లవమని అన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన సాగించిన అలుపెరగని పోరాటం నేటి తరానికి స్ఫూర్తి, ప్రేరణ అని తెలిపారు. కుల వివక్షను ఎదుర్కొన్నా వెనుకడుగు వేయకుండా అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహోన్నత నేత బీపీ మండల్ అని, ఐక్యంగా కలిసి నడిస్తే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని ఆయన తన జీవితంతో చాటిచెప్పారని పేర్కొన్నారు.
మండల్ కమిషన్లో 42 సిఫార్సులు చేశారని, వాటిలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ అత్యంత కీలకమైనదని దుండ్ర కుమారస్వామి తెలిపారు. ఆ సిఫార్సు ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27 శాతం ఓబీసీ రిజర్వేషన్ అమలులోకి వచ్చిందని, అనంతరం కేంద్ర విద్యాసంస్థల్లోనూ 27 శాతం రిజర్వేషన్ అమలైందని చెప్పారు. ఒక ఆలోచన, ఒక కమిషన్, ఒక సిఫార్సు కోట్లాది బీసీల జీవితాల్లో మార్పుకు కారణమైందన్నారు. అయితే మండల్ కమిషన్లోని మిగిలిన సిఫార్సుల పరిస్థితిపై నేటికీ చర్చ అవసరమని, సామాజిక న్యాయం సంపూర్ణంగా సాధించేందుకు వాటి అమలుపై ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమించాల్సిన బాధ్యత బీసీలపై ఉందన్నారు. పదవులు ఎన్ని రోజులు చేపట్టామన్నది కాదు.. ప్రజలకు ఏం చేశామన్నదే ముఖ్యమని, బీహార్ ముఖ్యమంత్రిగా స్వల్పకాలం పనిచేసినా బీపీ మండల్ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచారని పేర్కొన్నారు. “చదువు.. చైతన్యం.. సంఘటితం” అనే సందేశాన్ని బీసీలు స్ఫూర్తిగా తీసుకోవాలని దుండ్ర కుమారస్వామి పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం, సమానత్వం, సాంఘిక వివక్ష లేని సమాజం, అసమానతలు లేని భవిష్యత్తు బీపీ మండల్ కన్న కలలని, వాటిని సాకారం చేయడం నేటి తరంపై ఉన్న బాధ్యతని అన్నారు.
రిజర్వేషన్లు హఠావో అని చెప్పే ముందు “కుల వివక్ష హఠావో.. సామాజిక అన్యాయం హఠావో.. అవకాశాల అసమానత హఠావో” అనే నినాదం రావాలని స్పష్టం చేశారు. రిజర్వేషన్ సమాజాన్ని శాశ్వతంగా విభజించడానికి పుట్టింది కాదని, చారిత్రకంగా ఉన్న సామాజిక, విద్యా అసమానతలను తగ్గించి సమాన అవకాశాలను కల్పించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సాధనమని అన్నారు. లోపాలుంటే సరిచేయవచ్చని, కాలానుగుణంగా సమీక్షించవచ్చని, కానీ సామాజిక న్యాయం లక్ష్యాన్ని మాత్రం విస్మరించరాదని దుండ్ర కుమారస్వామి పేర్కొన్నారు. బీపీ మండల్ ఆశయాలను, ఆలోచనలను ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.


