మన ఏరువాక ఫార్మ్స్ పోస్టర్ లాంచ్ — రైతు నుంచి ప్రతి కుటుంబానికి నాణ్యమైన కూరగాయలు, పండ్లు
“ఆరోగ్యమే మహాభాగ్యం” అని మన పెద్దలు చెప్పిన మాటలను గుర్తుచేస్తూ, ప్రతి కుటుంబం తీసుకునే ఆహారం నాణ్యమైనదిగా, తాజాదిగా, పరిశుభ్రమైనదిగా ఉండాల్సిన అవసరం ఉందని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు.
సాక్షాత్తు పెద్దమ్మ అమ్మవారి ఆశీస్సులతో, అమ్మవారి ఆలయ సమీపంలో మన ఏరువాక ఫార్మ్స్ పోస్టర్ను ఘనంగా ఆవిష్కరించారు. జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, ప్రముఖ సామాజికవేత్త దుండ్ర కుమారస్వామి ముఖ్యఅతిథిగా పాల్గొని పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ దళ్ దక్షిణ రాష్ట్రాల అధ్యక్షుడు కుర్మారావు, జాతీయ బీసీ దళ్ సంగారెడ్డి అధ్యక్షుడు రక్షణ, ఏరువాక ఫార్మ్స్ పర్యవేక్షణ మరియు పార్ట్నర్ ఏడుకొండలు, పద్మ తదితరులు పాల్గొన్నారు. ఇది కేవలం ఒక సంస్థ పోస్టర్ ఆవిష్కరణ కాదు—రైతు కష్టం, ఆరోగ్యకరమైన ఆహారం, వినియోగదారుడి నమ్మకాన్ని కలిపే ఒక కొత్త ఆలోచనకు శ్రీకారం.
ఈ సందర్భంగా దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ, “పొలం నుంచి నేరుగా మన కమ్యూనిటీకి, ప్రతి కుటుంబానికి తాజా మరియు నాణ్యమైన కూరగాయలను అందించాలనే గొప్ప సంకల్పంతో ఏరువాక ఫార్మ్స్ ఏర్పడటం అభినందనీయమని అన్నారు. స్థానిక రైతుల నుంచి నాణ్యమైన ఉత్పత్తులను సేకరించి వినియోగదారులకు అందించడం ద్వారా రైతు–వినియోగదారుడి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడంతో పాటు, ఇద్దరి మధ్య నమ్మకమైన వారధిగా ఏరువాక ఫార్మ్స్ నిలవాలని ఆకాంక్షించారు.
రైతుకు న్యాయమైన ధర — వినియోగదారుడికి నాణ్యమైన ఉత్పత్తి అనే సూత్రం ఏరువాక ఫార్మ్స్కు ప్రధాన బలంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఇతరుల కంటే తక్కువ ధరకు విక్రయించడమే లక్ష్యం కాకూడదని, ఇతరుల కంటే మెరుగైన నాణ్యత, తాజాదనం, పరిశుభ్రత, పారదర్శకత అందించడమే అసలైన ప్రత్యేకత కావాలని సూచించారు. రైతు బలపడితే వ్యవసాయం బలపడుతుందని, వ్యవసాయం బలపడితే దేశ ఆహార భద్రత బలపడుతుందని అన్నారు. అందువల్ల ఏరువాక ఫార్మ్స్ను కేవలం కూరగాయల సరఫరా సంస్థగా కాకుండా, రైతు నుంచి వినియోగదారుడి ఇంటి వరకు నమ్మకాన్ని, నాణ్యతను తీసుకెళ్లే సామాజిక బాధ్యత కలిగిన సంస్థగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.
ఏరువాక ఫార్మ్స్ లోగో ఒక గుర్తు మాత్రమే కాదు—రైతు ఆత్మగౌరవానికి, స్వచ్ఛమైన ఆహారానికి భరోసా, వినియోగదారుడి నమ్మకానికి ప్రతీకగా నిలవాలి అని దుండ్ర కుమారస్వామి అన్నారు. రైతుల నుంచి నేరుగా సేకరించిన సీజనల్ పండ్లు, కూరగాయలను పరిశుభ్రమైన విధానంలో కమ్యూనిటీ కుటుంబాలకు అందించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించవచ్చన్నారు. ఈ ఆలోచన ఒక కమ్యూనిటీ పరిధిలోనే పరిమితం కాకుండా, రైతు–వినియోగదారుడి మధ్య నమ్మకానికి జాతీయస్థాయిలో ఒక ఆదర్శ నమూనాగా ఎదగాలని ఆకాంక్షించారు. “పొలం నుంచి కుటుంబానికి… రైతు కష్టం నుంచి ఆరోగ్యకరమైన ఆహారం వరకు—ఇదే మన ఏరువాక ఫార్మ్స్ లక్ష్యం” అని ఆయన పేర్కొన్నారు.





