వైద్య రంగంలో ఏఐ విప్లవాత్మక మార్పులకు దోహదం
నేషనల్ హెల్త్ సమ్మిట్లో వైద్య నిపుణుల చర్చ
హైదరాబాద్: వైద్య రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) ఒక నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టిస్తోందని నేషనల్ హెల్త్ సమ్మిట్లో వక్తలు పేర్కొన్నారు. వ్యాధులను ముందస్తుగా గుర్తించడం, వేగవంతమైన చికిత్సా విధానాల రూపకల్పన, అధునాతన స్కానింగ్ విశ్లేషణ, రోబోటిక్ సర్జరీ వంటి రంగాల్లో ఏఐ వినియోగం వైద్య సేవల్లో గణనీయమైన మార్పులకు దోహదపడుతోందన్నారు. వైద్య రంగంలో సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం భవిష్యత్తులో మరిన్ని మార్పులకు దారితీయనుందని పలువురు వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు.
అంతర్జాతీయ స్థాయి వైద్య విధానాలు, ఆధునిక చికిత్సా పద్ధతులు, వైద్య రంగంలో చోటుచేసుకుంటున్న సాంకేతిక మార్పులపై సమగ్రంగా చర్చించారు. వైద్యుల ఆత్మీయ సమ్మేళనంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆరోగ్య రంగంలో వస్తున్న మార్పులపై చర్చావేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్లిస్ ఫుల్ డాక్టర్స్, బ్లిస్బ బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ హరికుమార్ నేతృత్వంలో ఈ సమ్మిట్ జరిగింది.
కార్యక్రమానికి మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా ఐఏఎస్, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, ప్రముఖ సామాజికవేత్త దుండ్ర కుమారస్వామి, ప్రొఫెసర్ ఆఫ్ సర్జన్ అపోల హాస్పిటల్ హరికుమార్ పాల్గొన్నారు.
వైద్య సేవల విస్తరణ, ఆధునిక వైద్య సాంకేతికత, కృత్రిమ మేధ ఆధారిత రోగ నిర్ధారణ, చికిత్సా విధానాల్లో వస్తున్న మార్పులు, భవిష్యత్తులో వైద్య రంగం ఎదుర్కొనే సవాళ్లపై నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఏఐ ఆధారిత సాంకేతికతను వైద్య నిపుణుల అనుభవానికి అనుసంధానం చేస్తే మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు రోగ నిర్ధారణలో వేగం, కచ్చితత్వం పెరిగే అవకాశాలున్నాయని చర్చించారు
దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ.. వైద్య రంగంలో ఏఐ వినియోగం అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటే నాణ్యమైన వైద్య సేవలను మరింత విస్తృతంగా అందించవచ్చన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధితో పాటు మానవీయ విలువలను కాపాడుతూ వైద్య సేవలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
అజయ్ మిశ్రా మాట్లాడుతూ.. ఆరోగ్య రంగంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వేగంగా పెరుగుతోందని, ఏఐ ఆధారిత వైద్య విధానాలు భవిష్యత్తులో కీలక పాత్ర పోషించనున్నాయన్నారు. వైద్య నిపుణులు, సాంకేతిక నిపుణులు, ప్రభుత్వ సంస్థలు సమన్వయంతో పనిచేస్తే ఆధునిక వైద్య సేవలను మరింత సమర్థంగా ప్రజలకు చేరువ చేయవచ్చన్నారు.
డాక్టర్ హరికుమార్ మాట్లాడుతూ.. ఏఐ వైద్యులకు ప్రత్యామ్నాయం కాదని, వైద్యుల నైపుణ్యాన్ని మరింత బలోపేతం చేసే శక్తివంతమైన సాధనమని అన్నారు. వైద్య రంగంలో వస్తున్న సాంకేతిక మార్పులపై వైద్యులు నిరంతరం అవగాహన పెంచుకుంటూ, రోగుల ప్రయోజనాలకు అనుగుణంగా కొత్త సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు.
సమ్మిట్లో డాక్టర్ కీర్తన యాదవ్–ఉస్మానియా అనస్తీషియా, దుబాయ్కు చెందిన రెటినా సర్జన్ డాక్టర్ నిజాముద్దీన్, కోటి ప్రభుత్వ మెటర్నిటీ అండ్ చిల్డ్రన్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుభాన్, అపోలో ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ డాక్టర్ హరికుమార్, న్యూరాలజిస్ట్ డాక్టర్ నిధి, మిసెస్ ఏషియా పసిఫిక్–2017 సుధా జైన్, సినీ నటి సనా తదితరులు పాల్గొన్నారు. వైద్యులు, వైద్య నిపుణులు, సామాజికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు పాల్గొని ఆరోగ్య రంగంలో భవిష్యత్ అవకాశాలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై అభిప్రాయాలు వెల్లడించారు. వైద్య రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ వైద్య నిపుణుల మధ్య పరస్పర అవగాహన, సహకారాన్ని పెంపొందించేందుకు ఇలాంటి సమ్మిట్లు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.




