బెల్లంపల్లి గురుకులంలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటనపై దుండ్ర కుమారస్వామి ఆగ్రహం
బాధ్యులపై తక్షణ సస్పెన్షన్తో పాటు కఠిన చర్యలు తీసుకోవాలి
అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటోంది
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై ప్రముఖ న్యాయవాది, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
గురుకుల విద్యాసంస్థల్లో పదేపదే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు. బెల్లంపల్లి గురుకులంలో సుమారు 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికావడం, వారిలో ఏడుగురి పరిస్థితి విషమించి మంచిర్యాల ఏరియా ఆసుపత్రికి తరలించాల్సి రావడం అధికార యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమని అన్నారు.
విద్యార్థినులకు అందించే ఆహార నాణ్యత, పరిశుభ్రత, వంటశాల నిర్వహణ, ఆహార నిల్వ విధానాలపై సంబంధిత అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, ఆ బాధ్యతను విస్మరించడం వల్లే ఇటువంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని విమర్శించారు.
ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నప్పటికీ కేవలం విచారణలకే పరిమితమై, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల నిర్లక్ష్య ధోరణి కొనసాగుతోందన్నారు. ఈ ఘటనలో బాధ్యులైన అధికారులు, సంబంధిత సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేసి, స్వతంత్రంగా ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
విద్యార్థుల ప్రాణాలకు భద్రత కల్పించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, ప్రతి గురుకులంలో ఆహార భద్రత ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని, నాణ్యమైన ఆహారం అందించడంలో ఎలాంటి రాజీ ఉండకూడదని సూచించారు.గురుకులాల్లో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలు ప్రజల్లో ప్రభుత్వంపై అసహనం పెంచుతున్నాయని, అధికారుల నిర్లక్ష్యం చివరికి ప్రభుత్వానికే చెడ్డ పేరు తీసుకొస్తోందని దుండ్ర కుమారస్వామి హెచ్చరించారు.
ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని గురుకుల విద్యాసంస్థల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, ఆహార భద్రత, పరిశుభ్రత, తాగునీటి నాణ్యతపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.



