కల్వకుంట్ల కవితతో బీసీ సంఘాల నేతలు భేటీ
బీసీల సామాజిక న్యాయం కోసం కేంద్రంపై ఒత్తిడి అవసరం
కవితతో భేటీ: 20 బీసీ కుల సంఘాలతో కీలక చర్చలు
దేశవ్యాప్తంగా బడుగు వర్గాల సామాజిక న్యాయం సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై తక్షణం ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి బోడ జనార్ధన్, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు మరియు బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి అన్నారు. మాజీ మంత్రి బోడ జనార్ధన్, దుండ్ర కుమారస్వామితో పాటు 20 బీసీ కుల సంఘాల నేతలు కలిసి తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీసీలకు సంబంధించిన పలు కీలక జాతీయ అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు.
ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, జనగణనలో ఓబీసీ వర్గాలకు ప్రత్యేక కాలమ్ లేకపోవడం, మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహిళలకు అన్యాయం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. జనగణనను రాజకీయంగా చూడొద్దని చెబుతున్నప్పటికీ, అందులో బీసీలను స్పష్టంగా గుర్తించకపోవడం అన్యాయమని నేతలు అభిప్రాయపడ్డారు. బీసీల ఆర్థిక, సామాజిక, విద్యా, ఉద్యోగ స్థితిగతులపై సమగ్ర డేటా లేకుండా అభివృద్ధి ప్రణాళికలు ఎలా రూపొందిస్తారని ప్రశ్నించారు.
దేశంలో మహిళలకు 33% రిజర్వేషన్ను స్వాగతిస్తున్నప్పటికీ, మహిళా రిజర్వేషన్లో ఓబీసీ మహిళలకు ప్రత్యేక సబ్కోటా తప్పనిసరిగా ఉండాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని దుండ్ర కుమారస్వామి కోరారు. దశాబ్దాలుగా బీసీలు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో అంచేతకు గురవుతున్నారని ఆయన పేర్కొంటూ, విద్య, ఉద్యోగం, ఆస్తి వంటి ప్రాథమిక హక్కులలో అత్యధికంగా నష్టపోయిన వర్గం బీసీలేనని అన్నారు.

దేశంలో సగానికి పైగా జనాభా ఉన్నప్పటికీ బీసీలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడం పెద్ద అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని, పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని, ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీలపై వివక్ష, హింసను అరికట్టేందుకు “బీసీ రక్షణ చట్టం” తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న డిజిటల్ స్వీయ గణనలో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కాలమ్ ఉన్నప్పటికీ ఓబీసీలకు లేకపోవడం గమనార్హమని పేర్కొంటూ, ఇది సరిచేయకుండా సామాజిక న్యాయం సాధ్యం కాదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బోడ జనార్ధన్, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, జాతీయ బీసీ దళ్, తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు డి.వి. సత్యనారాయణ, రాజేష్ బాబా, యాదవ్ తదితరులు మరియు వివిధ బీసీ కుల సంఘాల నేతలు పాల్గొన్నారు.