బార్ అసోసియేషన్ ఎన్నికల్లో బీసీలను గెలిపించాలి –న్యాయవ్యవస్థలో సమానత్వమే లక్ష్యం
“మన ఓట్లు మనకే… బీసీల ఓట్లు బీసీలకే… బీసీ న్యాయవాదులకే” – సామాజిక న్యాయం కోసం ఐక్యత ప్రతిజ్ఞ అని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి పేర్కొన్నారు.
సోమవారం హైకోర్టు, జిల్లా కోర్టులు, మున్సిఫ్ కోర్టుల్లో ఈ నెల 26న నిర్వహించనున్న అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో బీసీ న్యాయవాదులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ న్యాయవాదులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సోమవారం హైకోర్టులో పర్యటించిన ఆయన, పోటీలో ఉన్న పలు బీసీ న్యాయవాదులను కలిసి మద్దతు తెలుపుతూ ప్రచారం నిర్వహించారు.
అనంతరం బీసీ న్యాయవాదులు, బీసీ సంఘాల నేతలతో కలిసి “బీసీల ఓట్లు బీసీలకే” అనే నినాదంతో ఐక్యత ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ ఓం ప్రకాష్, సాయి సారిక చందన తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ… న్యాయవ్యవస్థలో బీసీ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఐక్యంగా ఓటు మార్పిడి ద్వారా న్యాయవ్యవస్థలో బీసీ ప్రతినిధుల సంఖ్యను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
న్యాయవ్యవస్థలో సమానత్వం కోసం, సామాజిక న్యాయం కోసం జరుగుతున్న పోరాటంపై ఈరోజు చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయం అంటే కేవలం కోర్టు గోడల మధ్య జరిగేది కాదని, అది ప్రతి వర్గానికి చేరి, ప్రతి కులానికి అందినప్పుడే నిజమైన న్యాయం అవుతుందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో న్యాయవాదుల హక్కులు, సంక్షేమం, అభివృద్ధి, చట్టబద్ధమైన డిమాండ్ల సాధన కోసం జరుగుతున్న తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ ఎన్నికలు అత్యంత కీలకమని వివరించారు. ఇవి సాధారణ ఎన్నికలు కావని, న్యాయవాదుల భవిష్యత్తును నిర్ణయించే తీర్పు వంటివని అన్నారు.
ఎవరికి ఓటు వేయాలి? ఎవరికీ అవకాశం ఇవ్వాలి? అనే ప్రశ్నలకు సమాధానం ఒక్కటే – సమానత్వం అని స్పష్టం చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేర్కొన్న “అవకాశాలు లేని కులాలు అంతరిస్తాయి” అనే మాటలను గుర్తు చేస్తూ, నేటి న్యాయవ్యవస్థలో అదే పరిస్థితి నెలకొన్నదని అన్నారు.
దశాబ్దాలుగా ఓబీసీ న్యాయవాదులు ప్రాతినిధ్యం కోల్పోతున్నారని, ఇది ప్రతిభ లోపం కాదు, అవకాశాల కొరత ఫలితమని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో అనేక కులాలకు ప్రాతినిధ్యం లేకపోవడం యాదృచ్ఛికం కాదని, అది వ్యవస్థలోని అన్యాయానికి నిదర్శనమని విమర్శించారు.
బీసీలు దశాబ్దాలుగా ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో అణచివేయబడ్డారని, ఇప్పుడు న్యాయవ్యవస్థలో కూడా అదే పరిస్థితి కొనసాగుతోందన్నారు. పదవులు లేకుండా, అవకాశాలు లేకుండా బీసీ న్యాయవాదులు పక్కన పెట్టబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
న్యాయవాదులు వేయబోయే ఒక్క ఓటు ఒక అభ్యర్థిని మాత్రమే గెలిపించదని, ఒక వర్గాన్ని నిలబెడుతుందని తెలిపారు. ఈరోజు వేసే ఓటు రేపటి న్యాయవ్యవస్థ చరిత్రను రాస్తుందని భావోద్వేగంగా అన్నారు.