నరేంద్ర మోదీ మిషన్–విజన్ పత్రం లోగో, కవర్ పేజీల ఆవిష్కరణ
లోగో, కవర్ పేజీలు (ముఖచిత్రాలు) ఆవిష్కరించిన డా. కె. లక్ష్మణ్
తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు రూపొందించిన శ్రీ నరేంద్ర మోదీ మిషన్–విజన్ పత్రం త్రిభాషా మూడు సంపుటాల ప్రాజెక్ట్కు సంబంధించిన లోగో, కవర్ పేజీలు (ముఖచిత్రాలు)ను బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్ (Dr.K Laxman) ఆవిష్కరించారు.
శుక్రవారం నాడు హైదరాబాద్ అశోక్ నగర్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమం ప్రాజెక్ట్ ప్రగతిలో కీలక ఘట్టంగా నిలిచింది. ఈ సందర్భంగా డా. కె. లక్ష్మణ్ మాట్లాడుతూ సమకాలీన నాయకత్వం, పరిపాలనా మైలురాళ్లను పత్రరూపంలో సమగ్రంగా అందించే ఇలాంటి గ్రంథాలు అధ్యయన అవసరాలకు, ప్రజల్లో అవగాహన విస్తరణకు ఉపయోగకరంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు రూపొందించిన ఈ త్రిభాషా ప్రచురణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవన ప్రయాణం, నాయకత్వ మైలురాళ్లు, విధాన కార్యక్రమాలు, జాతీయ స్థాయి కృషిని సమగ్రంగా ప్రతిబింబించే మూడు సంపుటాల సూచిక గ్రంథంగా సిద్ధమవుతోంది. ఈ గ్రంథాల రచనా ప్రక్రియ గత ఐదు నెలలుగా నిరంతరంగా కొనసాగుతోంది.
ఆవిష్కరించిన లోగో, కవర్ పేజీలు ప్రాజెక్ట్ పూర్తయ్యేంత వరకు అధికారిక రూపంగా వినియోగంలో ఉంటాయి. త్రిభాషా సంపుటాల కవర్ పేజీలు అన్ని అధికారిక అవసరాలు, సోషల్ మీడియా ప్రసారం కోసం వినియోగించబడతాయి.
మార్చి నెల చివరి వారంలో న్యూఢిల్లీలో ఈ త్రిభాషా గ్రంథాల ఆవిష్కరణ నిర్వహించబడుతుంది. తెలుగు, ఆంగ్లం, హిందీ మూడు భాషల్లో ఈ గ్రంథాలు వెలువడనున్నాయి.
