సామాజిక విప్లవకారుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా
భారతీయ సామాజిక ముఖచిత్రాన్ని మార్చి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి అన్నారు.
ఈ రోజు లకిడికపూల్లోని మీడియా పాయింట్ వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు అధ్యక్షత వహించగా, సూర్యారావు సమన్వయకర్తగా వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్, ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు చిరంజీవులు,డాక్టర్ జై పూర్ణచంద్రరావు ఐపీఎస్ మాజీ డిజిపి నేషనల్ కోఆర్డినేటర్AIBSP, పూర్ణచంద్రరావు, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, సూర్యారావు తదితరులు శివాజీ మహారాజ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ—
ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక సామాజిక విప్లవకారుడని పేర్కొన్నారు. మొఘల్ సామ్రాజ్యాన్ని వణికించిన అపార ధైర్యసాహసాల వీరుడని కొనియాడారు. చరిత్ర ఆయనను కేవలం యుద్ధాల కోణంలో మాత్రమే చూస్తే శివాజీ ఒక వీరుడు; కానీ సామాజిక కోణంలో పరిశీలిస్తే ఆయన ఒక యుగపురుషుడు అని తెలిపారు. అణగారిన వర్గాల ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, సమానత్వం, రైతుల శ్రేయస్సు కోసం స్వరాజ్యాన్ని నిర్మించి, నేటి ప్రజాస్వామ్యానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు.
అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా శివాజీ మహారాజ్ను ఆదర్శ పాలకుడిగా, అణగారిన వర్గాల విముక్తి ప్రదాతగా గౌరవించినట్లు గుర్తుచేశారు.
మాజీ ఐఏఎస్ చిరంజీవులు మాట్లాడుతూ— శివాజీ మహారాజ్ నేటి తరానికి ఆదర్శప్రాయుడని, బహుజన రాజ్యాధికార సాధనకు ఆయన స్ఫూర్తి అత్యవసరమని అభిప్రాయపడ్డారు. మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ— బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, మహిళల గౌరవ రక్షణ కోసం శివాజీ మహారాజ్ చేసిన కృషి విశేషమని కొనియాడారు.
సమన్వయకర్త సూర్యారావు మాట్లాడుతూ శివాజీ మహారాజ్ ఆశయాలను యువత లోనికి తీసుకెళ్లడం సమాజం పట్ల మన బాధ్యత అని అన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం సాధనలో ఆయన స్ఫూర్తి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాల్గొన్నవారు శివాజీ మహారాజ్ పోరాట స్ఫూర్తిని సామాజిక దృష్టికోణంలో ఆచరణలోకి తీసుకువచ్చి, సమానత్వ సమాజ నిర్మాణం దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.