సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం
బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే ఎంపీటీసీ–జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలి
— జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీసీ నాయకుల డిమాండ్
బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి డిమాండ్ చేశారు.
కాచిగూడలోని జాతీయ బీసీ దళ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ…
దేశంలో బడుగు, బలహీన వర్గాలకు బీజేపీ పార్టీ దశాబ్దాలుగా తీవ్ర అన్యాయం చేస్తూనే ఉందని విమర్శించారు. సామాజిక న్యాయం పేరుతో మాటలు చెప్పే బీజేపీ, అధికారంలో ఉన్న చోట బీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు నమ్మకంతోనే ఓట్లు వేసి అధికారంలోకి తీసుకువచ్చారని, ఆ నమ్మకానికి తగ్గట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే బీసీలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థలైన ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను పెంచి అమలు చేయకుండా ఎన్నికలు నిర్వహించడం తీవ్ర అన్యాయమని స్పష్టం చేశారు.
బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలంటే రిజర్వేషన్ల పెంపు తప్పనిసరి అని, ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన నిర్ణయం తీసుకుని అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లు పెంచే వరకు ఎంపీటీసీ–జెడ్పిటిసి ఎన్నికలను వాయిదా వేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.