డీలిమిటేషన్ వెనుక రహస్య ఎజెండా? కేంద్రం కుట్రపై జాతీయ బీసీ దళ్ ఆరోపణ
జనాభా గణనతో పాటు కులగణన సేకరణను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తూ, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియలో రహస్య ఎజెండాతో వ్యవహరిస్తోందని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. కాచిగూడ లోని ప్రైవేట్ హోటల్లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ఈ ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే విధంగా ఉండొచ్చని, దీనిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఆయన హెచ్చరించారు.
జనగణన, కులగణన ఆలస్యంపై విమర్శలు:
జనాభా గణనతో పాటు కులగణన సేకరణను కేంద్రం ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందని కుమారస్వామి విమర్శించారు. “ఈ జాప్యం సామాజిక న్యాయానికి అడ్డంకి.
డీలిమిటేషన్ ప్రక్రియ యాదృచ్ఛికం కాదు, దీని వెనుక రాజకీయ కుట్ర దాగి ఉంది,” అని ఆయన వ్యాఖ్యానించారు. 2026లో ప్రారంభమయ్యే జనగణన, కులగణన ప్రక్రియలు 2027 వరకు వాయిదా పడుతుండటం ప్రమాదకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం:
జనాభా నియంత్రణ విధానాలను కచ్చితంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల పార్లమెంటు సీట్లను కోల్పోయే ప్రమాదం ఉందని దుండ్ర కుమారస్వామి హెచ్చరించారు. “జనాభా నియంత్రణలో విజయం సాధించిన హిందీయేతర రాష్ట్రాలు ఇప్పుడు శిక్షింపబడుతున్నాయి. జనాభా నియంత్రణను పట్టించుకోని రాష్ట్రాలు అదనపు సీట్లను బహుమతిగా పొందనున్నాయి,” అని ఆయన బాధపడ్డారు. ఇది ఫెడరల్ వ్యవస్థను దెబ్బతీసే చర్యగా, అభివృద్ధి సాధించిన రాష్ట్రాలను విస్మరించే ప్రయత్నంగా ఆయన అభివర్ణించారు.
కేంద్రం రాజకీయ లబ్ధి కోసం కుట్ర?:
2027లో చేపట్టనున్న జనాభా గణన, 1971 గణన స్థానంలో ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజనకు ఉపయోగపడనుందని దుండ్ర కుమారస్వామి పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ద్వారా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించి, పార్లమెంటులో తమకు అనుకూలంగా పునర్వ్యవస్థీకరణ చేసుకోవాలనే లక్ష్యంతో బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. “ఇది దక్షిణాది రాష్ట్రాలను పణంగా పెట్టే కుట్ర,” అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అప్రమత్తంగా ఉండాలని పిలుపు:
దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని కాపాడుకోవడానికి వ్యూహాత్మక చర్యలు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని కుమారస్వామి పిలుపునిచ్చారు. “ప్రమాదం మన ఇంటి దాకా వచ్చింది. అప్రమత్తంగా ఉండి, దక్షిణాది రాష్ట్రాల హక్కులను రక్షించుకోవాలి,” అని ఆయన ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో బిసి నాయకులు మేధావులు న్యాయవాదులు పాల్గొన్నారు.