ప్రధాని హైదరాబాద్ సభలో బీసీ కులగణనపై స్పష్టమైన హామీ ఇవ్వాలి
“డిజిటల్ జనగణనలో ఓబీసీ కాలమ్ పెట్టాలి… బీసీలకు న్యాయం చేయాలంటే కులగణనే మార్గం”
జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి(Dundra Kumara Swamy)
“సామాజిక న్యాయం జరగాలంటే ముందుగా సామాజిక వాస్తవాలు బయటపడాలి… అదే నిజమైన సామాజిక న్యాయం” అని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో కుల సంఘాలు, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.
దేశ ప్రధాని నరేంద్ర మోడీ రేపు 10వ తేదీన హైదరాబాద్కు వస్తున్న సందర్భంగా బీసీల తరఫున స్వాగతం పలుకుతున్నామని, అయితే దేశ ప్రజలు మూడుసార్లు ప్రధానిగా ఎన్నుకున్న తర్వాత కూడా బీసీలకు కేంద్ర ప్రభుత్వం ఏమి చేసిందో స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి చెబుతున్నారని, అయితే తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్న బీసీల అభివృద్ధికి కేంద్రం ఏ ప్రాధాన్యత ఇచ్చిందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. బీసీల కోసం ప్రత్యేక పథకాలు, రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో కల్పించిన అవకాశాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
దశాబ్దాలుగా బీసీలు కులగణన కోసం పోరాటం చేస్తున్నారని, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న డిజిటల్ జనగణనలో ఓబీసీ కాలమ్ లేకపోవడం బీసీలకు తీవ్ర అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో సగానికి పైగా ఉన్న బీసీల జనాభా లెక్కలను ఎందుకు దాచిపెడుతున్నారని ప్రశ్నించారు. లెక్కలే లేకపోతే వారి ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్యా, ఉద్యోగ పరిస్థితులు ఎలా తెలుస్తాయని, అభివృద్ధి ప్రణాళికలు ఎలా రూపొందిస్తారని నిలదీశారు. కులగణన జరగకపోవడం దేశ ప్రజాస్వామ్యానికి అవమానమని, సామాజిక న్యాయం సాధించాలంటే ముందుగా సామాజిక వాస్తవాలు బయటపడాల్సిందేనని పేర్కొన్నారు. అందుకే బీసీ కులగణన అత్యవసరమని డిమాండ్ చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహిళలకు సబ్ కోటా ఎందుకు కల్పించలేదని ప్రశ్నించిన ఆయన, బీసీల ఓట్లు కావాలనుకునే రాజకీయ పార్టీలు రిజర్వేషన్ల అమలులో ఎందుకు వెనుకడుగు వేస్తున్నాయని విమర్శించారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని, ఇతర వర్గాలకు రాజ్యాంగ సవరణల ద్వారా వేగంగా రిజర్వేషన్లు అమలు చేసే ప్రభుత్వాలు బీసీల విషయంలో మాత్రం మౌనం పాటిస్తున్నాయని అన్నారు. డిజిటల్ జనగణనలో ఓబీసీ కాలమ్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నిస్తూ, ప్రధాని హైదరాబాద్ సభలో బీసీలకు స్పష్టమైన హామీ ఇవ్వాలని, లేకపోతే దేశవ్యాప్తంగా బీసీల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ దళ్ జీహెచ్ఎంసీ ఉపాధ్యక్షుడు సందీప్, రమణ రాజు తదితర కుల సంఘాల నేతలు పాల్గొన్నారు.
