మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు..
సామాజిక విప్లవానికి నాంది
అణగారిన వర్గాల జీవితాల్లో అంధకారాన్ని చీల్చి వెలుగునిచ్చిన మహాత్ముడిగా ఫూలేను జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి పేర్కొన్నారు.
మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా రత్నాకర్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు సామాజిక చైతన్యానికి వేదికగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి హాజరయ్యారు. బీసీ జాగృతి అధ్యక్షుడు మురళీకృష్ణ, రత్నాకర్ ఎన్నికల కమిటీ అధ్యక్షుడు వినోద్ తదితరులు పాల్గొని ఫూలే ఆశయాలను స్మరించుకున్నారు. కార్యక్రమం మొత్తం ఫూలే భావజాలాన్ని తిరిగి ప్రజల్లో ప్రతిధ్వనింపజేసే దిశగా సాగింది.
ఈ సందర్భంగా దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ, “ఫూలే జయంతి ఒక మహనీయుడి జన్మదిన వేడుక మాత్రమే కాదు… అది భారత సామాజిక విప్లవానికి నాంది పలికిన చరిత్రాత్మక ఘట్టం” అని పేర్కొన్నారు. అసమానతలతో నిండిన సమాజంలో సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం అపూర్వమని అన్నారు. “విద్యతోనే ఆత్మగౌరవం సాధ్యం” అన్న నమ్మకంతో ఫూలే అణగారిన వర్గాలకు విద్య అనే శక్తిని అందించి, సమాజ మార్పుకు బాటలు వేశారని స్పష్టం చేశారు.
స్త్రీలు చదవలేరని చెప్పిన కాలంలో సావిత్రీబాయి ఫూలేతో కలిసి తొలి బాలికల పాఠశాలను స్థాపించడం, సత్యశోధక్ సమాజ్ ద్వారా అణగారిన వర్గాల హక్కుల కోసం గళమెత్తడం, ‘గులామగిరి’ వంటి రచనలతో అన్యాయంపై యుద్ధం ప్రకటించడం ఫూలే మహోన్నతతకు నిదర్శనమని ఆయన అన్నారు. “సమానత్వం కోసం పోరాడని జీవితం బానిసత్వమే” అన్న ఫూలే సందేశం నేటికీ సమాజానికి మార్గదర్శకమని, బడుగు బలహీన వర్గాలు, రైతులు, కార్మికులు, మహిళల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని దుండ్ర కుమారస్వామి పేర్కొన్నారు.
