సమాజ సంస్కరణ యోధుడు ఫూలేకు నివాళి
ఆధునిక భారత సమాజ సంస్కరణకు పునాది వేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి వేడుకలు కూకట్పల్లిలోని నేషనల్ బీసీ దళ్ తెలంగాణ కార్యాలయంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా నేషనల్ బీసీ దళ్ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు డి.వి.వి. సత్యనారాయణతో పాటు కార్యవర్గ సభ్యులు ఫూలే చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు సమర్పించారు. సమాజంలో విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఫూలే ఆలోచనలు నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా డి.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ, “ప్రాచీన యుగంలో గౌతమ బుద్ధుడు, ఆధునిక యుగంలో ఫూలే నాకు గురువులు” అని డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ పేర్కొన్న విషయాన్ని స్మరించారు. దళిత, గిరిజన, బలహీన వర్గాల అభ్యున్నతే రాజ్యాధికార సాధనకు మార్గమని ఫూలే సూచించిన దారిని అంబేడ్కర్ అనుసరించారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫూలే కాంస్య విగ్రహాలను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని, ఆయన ఆశయాలను ప్రజల్లో విస్తృతంగా చాటే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సోనేన రవికుమార్, అలీభాయ్ తదితరులు పాల్గొని ఫూలేకు నివాళులు అర్పించారు.