ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్లో అంతర్జాతీయ సదస్సు
రష్యా, ఫ్రాన్స్ సహా పలు దేశాల ప్రతినిధుల సమక్షంలో గ్లోబల్ పీస్ కాన్ఫరెన్స్
ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వక్తలు పేర్కొన్నారు. ప్రముఖ న్యూస్ ఛానల్ మరియు బ్లిస్ బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ సంయుక్త ఆధ్వర్యంలో “గ్లోబల్ పీస్ కాన్ఫరెన్స్” ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి రష్యా, ఫ్రాన్స్, అమెరికా తదితర దేశాలకు చెందిన అంతర్జాతీయ దౌత్యవేత్తలు, శాంతి దూతలు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరై ప్రపంచ శాంతి, మానవతా విలువలు, అంతర్జాతీయ సహకారం, దౌత్య సంబంధాల బలోపేతంపై అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
సదస్సులో గ్లోబల్ ప్రెసిడెంట్ – ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ క్లబ్, బ్రిక్స్ కల్చర్ అండ్ మీడియా ఫోరం ఉపాధ్యక్షుడు, ఐక్యరాజ్యసమితి యూపీఎఫ్ పీస్ అంబాసిడర్ డా. సెర్గే ద్వోర్యానోవ్, వరల్డ్ అలయన్స్ “పీస్మేకర్” వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి యూరీ సఫ్రోనోవ్, ప్రముఖ న్యూస్ ఛానల్ చైర్మన్ లక్ష్మీరావు, జాతీయ నాయకుడు, ప్రముఖ సామాజికవేత్త దుండ్ర కుమారస్వామి, మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా (Ajay Mishra) తదితరులు పాల్గొన్నారు.
మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా మాట్లాడుతూ దేశాల మధ్య పోటీ సహజమేనని, కానీ శత్రుత్వానికి తావు ఉండకూడదని అన్నారు. ప్రపంచ భవిష్యత్తుకు సహకారమే మార్గమని, శాంతి నెలకొంటేనే రైతుకు పంట, యువతకు ఉపాధి, పిల్లలకు విద్య, మహిళలకు భద్రత లభిస్తాయని పేర్కొన్నారు.
ప్రముఖ ఛానల్ చైర్మన్ లక్ష్మీరావు మాట్లాడుతూ భారతదేశం వేల ఏళ్ల క్రితమే “వసుధైవ కుటుంబకం” అనే సందేశాన్ని ప్రపంచానికి అందించిందని, ప్రపంచమంతా ఒకే కుటుంబమనే భావనతో మానవత్వం, స్నేహం, శాంతి కోసం అన్ని దేశాలు కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
జాతీయ నాయకుడు దుండ్ర కుమారస్వామి (Dundra Kumara Swamy)మాట్లాడుతూ దేశాల సరిహద్దులు వేరైనా, మానవత్వానికి సరిహద్దులు ఉండవని, ప్రపంచాన్ని ఏకం చేసే శక్తి శాంతి మాత్రమేనని అన్నారు. ప్రపంచంలో అత్యంత విలువైన సంపద మనిషి ప్రాణమని, యుద్ధం విధ్వంసాన్ని సృష్టిస్తే శాంతి అభివృద్ధికి మార్గం చూపుతుందని పేర్కొన్నారు. తుపాకులు సమస్యలను పరిష్కరించలేవని, సంభాషణలు, దౌత్య సంబంధాల ద్వారానే శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని చెప్పారు. ఆయుధాలపై చేసే వ్యయంకంటే విద్య, వైద్యం, మానవాభివృద్ధిపై పెట్టుబడులు ప్రపంచానికి మరింత మేలు చేస్తాయని, యుద్ధంలో గెలిచిన దేశాలు చరిత్రలో నిలిచినా, శాంతిని కాపాడిన నాయకులు మానవ హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతారని అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన దౌత్య ప్రతినిధులు, సామాజికవేత్తలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


