నగర రోడ్లపై ఎలక్ట్రికల్ బస్సులు పరుగులు తీయనున్నాయి.
కాలుష్య నివారణ, పర్యావరణ హితంలో భాగంగా బ్యాటరీతో నడిచే బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేయనున్నది. మొదటిదశలో 48 బస్సులను కొనుగోలు చేసి సిటీ బస్సులుగా తిప్పాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఈ నెల 15న ఆర్టీసీ అధికారులు సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఎలక్ట్రికల్ వాహన పాలసీ తీసుకొస్తున్న క్రమంలో ఆర్టీసీ కూడా బ్యాటరీతో నడిచే బస్సులను కొనుగోలు చేస్తున్నది. ఇప్పటికే ఎలక్ట్రికల్ వాహనాలకు రాయితీలుంటాయని కేంద్రం ప్రకటించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పన్ను రాయితీ ఇస్తామని చెప్పడంతో వీటిని తీసుకురావాలని నిర్ణయించారు. రూ.2 కోట్ల విలువైన బస్సును 50 శాతం రాయితీతో అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
ఇప్పటికే బెంగళూరులో ఎలక్ట్రికల్ బస్సులు విజయవంతంగా నడుస్తున్న నేపథ్యంలో ఇక్కడ కూడా ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు. కాలుష్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ఇప్పటికే ఆర్టీసీ సీఎన్జీ వాహనాలను నగరంలో తిప్పుతున్నది. డీజిల్ బస్సులతో పోలిస్తే ఈ వాహనాలు కాలుష్యం విషయంలో మెరుగైన ఫలితాలిస్తుండటంతో ఎలక్ట్రికల్ వాహనాలు మరింత ప్రయోజనకరంగా ఉంటాయని అధికారులు నిర్ణయించారు. ఒక్కసారి పూర్తిగా చార్జి చేస్తే 200 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. కొత్తగా ప్రవేశపెట్టే ఎలక్ట్రికల్ వాహనాలు మెట్రోకు అనుసంధానించడంతోపాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి నడిపించనున్నట్టు వివరించారు.